Let's talk: editor@tmv.in
టీ20 వరల్డ్‌కప్‌లో భారత్–పాక్ మ్యాచ్ లేకపోతే 250 మిలియన్ డాలర్లు నష్టం

టీ20 వరల్డ్‌కప్‌లో భారత్–పాక్ మ్యాచ్ లేకపోతే 250 మిలియన్ డాలర్లు నష్టం

Pinjari Chand
3 ఫిబ్రవరి, 2026

ఐసీసీ టోర్నీల్లో భారత్–పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌కు ఉన్న వాణిజ్య విలువ అసాధారణమైనదని, ఈ ఒక్క మ్యాచ్ ద్వారానే సుమారు 250 మిలియన్ అమెరికన్ డాలర్లు (రూ. 2,200 కోట్లకు పైగా) ఆదాయం వస్తుందని అంచనాలు చెబుతున్నాయి. అయితే, రాబోయే టీ20 వరల్డ్‌కప్‌లో ఈ కీలక పోటీ జరగకపోతే, అన్ని వర్గాలకు భారీ ఆర్థిక నష్టాలు తప్పవని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారత్–పాక్ జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడకపోయినా, బహుళ జట్లతో జరిగే ఐసీసీ టోర్నీల్లో మాత్రం ఈ మ్యాచ్ తప్పనిసరిగా జరుగుతుంది. అందుకే ప్రతి ప్రపంచకప్‌లోనూ ఐసీసీ ఈ రెండు జట్లను ఒకే గ్రూప్‌లో ఉంచుతుంది. ఈ నేపథ్యంలో, ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. పాకిస్థాన్ తన నిర్ణయంపై కఠినంగా నిలబడితే, కోట్లాది డాలర్ల ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మ్యాచ్ జరగకపోతే ఐసీసీతో పాటు, భారత మీడియా హక్కుల దారుడు అయిన జియోస్టార్‌కూ భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇప్పటికే ఐసీసీతో ఉన్న 3 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని పునఃసమీక్షించేందుకు జియోస్టార్ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో, ఈ మ్యాచ్ రద్దు ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపనుంది.

ఒక భారత్–పాక్ మ్యాచ్‌కు సంబంధించిన ప్రకటనల ఆదాయం మాత్రమే రూ. 200–250 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ మ్యాచ్‌లో 10 సెకన్ల ప్రకటనకు రూ. 40 లక్షల వరకు ధర పలికే పరిస్థితి ఉంటుంది. మ్యాచ్ జరగకపోతే ఈ మొత్తం ఆదాయం గాలిలో కలిసిపోయినట్లే. మ్యాచ్‌కు పాకిస్థాన్ హాజరుకాకపోతే భారత్‌కు వాకోవర్ ద్వారా పూర్తి పాయింట్లు లభిస్తాయి. అయితే, ఐసీసీకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై ఆర్థిక జరిమానాలు విధించే అధికారం ఉంది.

ఈ అంశంపై స్పందించిన ఐసీసీ, పీసీబీ మాజీ కమ్యూనికేషన్ హెడ్ సామీ-ఉల్-హసన్ బర్నీ ఒక్క మ్యాచ్ వల్లే 250 మిలియన్ డాలర్ల నష్టం వస్తోంది. పాకిస్థాన్ వార్షిక ఆదాయం మొత్తం 35.5 మిలియన్ డాలర్లు మాత్రమే. ఈ రెండింటి మధ్య తేడా ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు అని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మీడియా సంస్థ ‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ కూడా పరిశ్రమ వర్గాలను ఉటంకిస్తూ, భారత్–పాక్ మ్యాచ్‌కు సుమారు బిలియన్ మందికి పైగా ప్రేక్షకులు ఉంటారని, ఒక్కో మ్యాచ్ విలువ 250 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని తెలిపింది. పాకిస్థాన్ ప్రకటన అనంతరం ఐసీసీ విడుదల చేసిన ప్రకటన కూడా ఈ మ్యాచ్ ప్రాధాన్యతను స్పష్టం చేసింది.

ప్రపంచ స్థాయి క్రీడా ఈవెంట్‌లో అర్హత సాధించిన అన్ని జట్లు షెడ్యూల్ ప్రకారం సమానంగా పోటీపడాలి. ఎంపిక చేసిన మ్యాచ్‌లకే హాజరుకావడం పోటీ ఆత్మను, న్యాయసూత్రాలను దెబ్బతీస్తుందని ఐసీసీ పేర్కొంది. ఈ వివాదాల మధ్య, ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే టీ20 వరల్డ్‌కప్‌లో తమ ఇతర మ్యాచ్‌ల కోసం పాకిస్థాన్ జట్టు కొలంబోకు చేరుకుంది. 2027 వరకూ భారత్–పాక్ మ్యాచ్‌లకు హైబ్రిడ్ మోడల్‌ను ఐసీసీ, బీసీసీఐ, పీసీబీ అంగీకరించిన నేపథ్యంలో, ఈ మ్యాచ్‌ను మాత్రమే బహిష్కరించడాన్ని సమర్థించుకోవడం పీసీబీకి కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిణామాలన్నీ టీ20 వరల్డ్‌కప్‌లో అత్యంత ఆసక్తికరమైన భారత్–పాక్ పోరు భవితవ్యంపై సందేహాలు పెంచుతున్నాయి.