Let's talk: editor@tmv.in
టీజీఎస్‌ఆర్టీసీకి కొత్తగా 1,085 ఎలక్ట్రిక్‌ బస్సులు

టీజీఎస్‌ఆర్టీసీకి కొత్తగా 1,085 ఎలక్ట్రిక్‌ బస్సులు

Gaddamidi Naveen
24 ఫిబ్రవరి, 2026

భాగ్యనగరం పర్యావరణహిత ప్రజా రవాణా దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ ఆర్టీసీ), 'ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్' ద్వారా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ నుంచి 1,085 ఎలక్ట్రిక్ బస్సుల సరఫరా కోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్ పొందింది. ఈ భారీ ఒప్పందంతో హైదరాబాద్ నగరం దేశంలోనే గ్రీన్ మొబిలిటీకి నాయకత్వం వహించబోతోంది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌ను గ్రీన్ మొబిలిటీలో జాతీయ స్థాయిలో ముందంజలో నిలపాలని స్పష్టమైన దృష్టితో ముందుకు సాగుతున్నారు. ప్రజా రవాణా రంగంలో వేగవంతమైన విద్యుదీకరణ, నగర కార్బన్ ఉద్గారాల తగ్గింపు, పరిశుభ్ర శక్తి వనరుల విస్తరణ వంటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకుంది. ఈ 1,085 ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశపెట్టడం ద్వారా ఫాసిల్ ఇంధనాలపై ఆధారాన్ని తగ్గిస్తూ, లో-కార్బన్ పట్టణ వాతావరణాన్ని నిర్మించాలనే లక్ష్యానికి మరింత బలం చేకూరనుంది.

ఈ ఆర్డర్ ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ పథకం కింద మంజూరైంది. ఈ కార్యక్రమాన్ని 'కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ ముందుకు తీసుకెళ్తోంది. దేశవ్యాప్తంగా విద్యుత్ ఆధారిత ప్రజా రవాణాను వేగవంతం చేయడం ఈ పథక లక్ష్యం. ఈ బస్సులు హైదరాబాద్ నగరంలోనే ప్రవేశపెట్టబడుతూ, సుస్థిర, జీరో ఎమిషన్ రవాణా వ్యవస్థను బలోపేతం చేయనున్నాయి. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల తయారీలో అగ్రగామిగా ఉన్న ఒలెక్ట్రా ఇప్పటికే దేశవ్యాప్తంగా 3,600కు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగంలోకి తెచ్చింది. 10,000కు పైగా వాహనాల ఆర్డర్ బుక్ కలిగిన ఈ సంస్థ ఇప్పటివరకు 500 మిలియన్ గ్రీన్ కిలోమీటర్ల ప్రయాణాన్ని నమోదు చేసింది. ఎలక్ట్రిక్ బస్సులతో పాటు సుస్థిర మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన ఎలక్ట్రిక్ టిప్పర్లను కూడా తయారు చేస్తోంది.

ఈ ప్రాజెక్ట్ కింద ఒలెక్ట్రా 12 మీటర్ల పొడవున్న లో-ఫ్లోర్ బస్సులను ఏసీ, నాన్-ఏసీ వేరియంట్లలో సరఫరా చేయనుంది. భారతీయ రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన ఈ బస్సులలో అధునాతన 'ఎయిర్ సస్పెన్షన్' వ్యవస్థ ఉంటుంది. అధిక సామర్థ్యం కలిగిన లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ల ద్వారా ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల పైగా ప్రయాణించవచ్చు. కేవలం 45 నిమిషాల్లో ఛార్జింగ్ పూర్తి చేసే అవకాశం ఉంది. వికలాంగుల కోసం బస్సులలో ప్రత్యేక వీల్‌చైర్ స్థలాలను కేటాయించారు.

మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ బాబు మాట్లాడుతూ.. ఈ ఆర్డర్ ఒలెక్ట్రా ప్రస్థానంలో ఒక మైలురాయి అని, 'మేక్ ఇన్ ఇండియా' స్ఫూర్తితో ప్రపంచ స్థాయి ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేయడంలో తమ నిబద్ధతను ఇది చాటుతుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థ సమర్థవంతంగా, పర్యావరణ బాధ్యతతో కూడిన భవిష్యత్తు వైపు సాగుతోంది.