
జోర్డాన్తో బంధం మరింత పటిష్టం: ప్రధాని మోడీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల (డిసెంబర్ 15, 16) జోర్డాన్ పర్యటన ముగిసింది. జోర్డాన్ రాజు అబ్దుల్లా IIతో జరిగిన కీలక చర్చల ఫలితంగా, రెండు దేశాల భాగస్వామ్యం బలం పుంజుకుందని ప్రధాని మోడీ ప్రకటించారు. దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన ఈ పర్యటన, భారత్-జోర్డాన్ మధ్య ఉన్న పాత స్నేహాన్ని మరింత బలోపేతం చేసింది. ఈ చర్చల ద్వారా మన పౌరులందరికీ అభివృద్ధి, సంక్షేమం కోసం కొత్త మార్గాలు తెరుచుకున్నాయని ప్రధాని మోదీ సోషల్ మీడియాలో తెలిపారు.
వ్యాపారంపై భారీ దృష్టి
వ్యాపారం, ఆర్థిక సహకారం ఈ చర్చల్లో కీలక అంశంగా నిలిచింది. ప్రస్తుతం జోర్డాన్కు భారత్ మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఇరు దేశాలు తమ ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్య విలువైన 2.3 బిలియన్ డాలర్లను రాబోయే ఐదేళ్లలో మరింత గణనీయంగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. భారతదేశానికి ఎంతో అవసరమైన ముఖ్య ఎరువులైన ఫాస్ఫేట్ సరఫరాలో జోర్డాన్తో సహకారాన్ని పెంచడానికి అంగీకారం కుదిరింది. అలాగే, వ్యవసాయ రంగంలో కొత్త టెక్నాలజీలు, నైపుణ్యాలను పరస్పరం పంచుకోవడం ద్వారా పంట దిగుబడిని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చివరగా జోర్డాన్ భౌగోళిక స్థానాన్ని, సరుకు రవాణా సామర్థ్యాలను ఉపయోగించుకుని, ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో రెండు దేశాల మధ్య ఆర్థిక లాభాలను పెంచే ఒక వ్యాపార కారిడార్ను బలోపేతం చేయాలని నిర్ణయించారు.
టెక్నాలజీ, ఆరోగ్యం బంధం
డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి ప్రభుత్వ పనులను మెరుగుపరచడానికి సహకరించుకోవాలని, సురక్షితమైన ఆన్లైన్ వాతావరణాన్ని నిర్మించడానికి కలిసి పనిచేయాలని అంగీకరించారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో సహకారాన్ని పెంచడానికి, ముఖ్యంగా టెలిమెడిసిన్ (దూరం నుండే వైద్య సలహాలు), ఆరోగ్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడంపై దృష్టి సారించారు. ఫార్మా రంగం (మందుల తయారీ) సహకారంలో చాలా ముఖ్యమైనదిగా గుర్తించారు.
పర్యావరణం, ఎనర్జీ రంగాల్లో ఉమ్మడి అడుగులు
నీటిని ఆదా చేసే వ్యవసాయ పద్ధతులు, భూగర్భ జలాల నిర్వహణ, వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించడం వంటి అంశాలలో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, పర్యావరణాన్ని కాపాడటానికి పునరుత్పాదక శక్తి వాడకాన్ని పెంచాలని చర్చించారు. కాలుష్యాన్ని తగ్గించే బయోఫ్యూయల్స్ వాడకంపై కూడా ఇరు దేశాలు దృష్టి సారించాయి.
అంతర్జాతీయ వేదికలపై మద్దతు
భారతదేశం ప్రారంభించిన అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ), విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్ఐ), గ్లోబల్ బయోఫ్యూయల్స్ కూటమి (జీబీఏ) వంటి కీలక అంతర్జాతీయ కూటములలో చేరడానికి జోర్డాన్ ఆసక్తి చూపడాన్ని భారత్ స్వాగతించింది. రాజు అబ్దుల్లా II భారత నాయకత్వాన్ని ప్రశంసించారు.
సాంస్కృతిక సంబంధాలు
2025–2029 కాలానికి కొత్త సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంపై ఇరు దేశాలు సంతకం చేశాయి. వాణిజ్యం, పర్యాటకం పెంచడానికి వీలుగా రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమాన లేదా రవాణా సౌకర్యాలను పెంచే మార్గాలను అన్వేషించాలని నిర్ణయించారు. కాగా ప్రధానమంత్రి మోడీ పర్యటన రెండు దేశాల మైత్రీ బంధాన్ని మరింత బలోపేతం చేసి, భవిష్యత్తులో ఉమ్మడి అభివృద్ధి కోసం ఒక బలమైన రోడ్మ్యాప్ను రూపొందించింది.
