Let's talk: editor@tmv.in
జేఎన్‌యూలో ఉద్రిక్తత

జేఎన్‌యూలో ఉద్రిక్తత

Pinjari Chand
24 ఫిబ్రవరి, 2026

ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఉపకులపతికి వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన కార్యక్రమం సోమవారం తెల్లవారుజామున హింసాత్మకంగా మారింది. రెండు విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు. వామపక్ష అనుబంధ సంఘాలు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. వామపక్ష మద్దతుతో ఉన్న జేఎన్‌యూ విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) ఆదివారం రాత్రి ‘సమతా జులోస్’ పేరుతో ఈస్ట్ గేట్ వరకు మార్చ్ నిర్వహించింది. ఉపకులపతి శాంతిశ్రీ ధూలిపూడి పండిట్ రాజీనామా చేయాలని, సస్పెన్షన్ ఆదేశాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.

వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఉద్రిక్తత

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఉపకులపతి శాశ్వత బాధితులుగా ఉండటం లేదా బాధిత కార్డు ఆడటం ద్వారా సమాజాలు అభివృద్ధి చెందవని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను జేఎన్‌యూఎస్‌యూ కులవివక్షతో కూడినవి, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేసేలా ఉన్నాయని విమర్శించింది.

పరస్పర ఆరోపణలు

నిరసనకారులు మాట్లాడుతూ, యాజమాన్యం తమతో చర్చించకుండా ఏబీవీపీ సభ్యులను ఎదుర్కొనేలా అనుమతించిందని ఆరోపించారు. మరోవైపు ఏబీవీపీ, వామపక్ష విద్యార్థులే ముందుగా దాడి ప్రారంభించారని పేర్కొంది. రెండు వర్గాలు పంచుకున్న వీడియోల్లో ముసుగులు ధరించిన వ్యక్తులు రాళ్లు విసురుతూ, కర్రలతో తిరుగుతున్న దృశ్యాలు కనిపించాయి. వామపక్ష సంఘాలు రాళ్ల దాడిని ఏబీవీపీ సభ్యులే ప్రారంభించారని ఆరోపించగా, ఏబీవీపీ మాత్రం తమ కార్యకర్తలపై 150-200 మంది గుంపుగా దాడి చేశారని, మహిళా విద్యార్థులపై కూడా దాడులు జరిగాయని తెలిపింది. జేఎన్‌యూఎస్‌యూ ప్రకారం, రాళ్లు, ఇటుకలతో దాడి చేయడంతో పలువురు గాయపడి, కొందరు సెంట్రల్ లైబ్రరీలో ఆశ్రయం పొందాల్సి వచ్చింది.

యాజమాన్యం స్పందన

జేఎన్‌యూ యాజమాన్యం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. కొన్ని విద్యా భవనాలను నిరసనకారులు తాళాలు వేసినట్లు సమాచారం అందిందని పేర్కొంది. నిరసనకారులు సెంట్రల్ లైబ్రరీలోకి వెళ్లి, నిరసనలో పాల్గొనని విద్యార్థులను బెదిరించినట్లు తెలిసింది. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుందని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. హింసను ఖండిస్తూ, విశ్వవిద్యాలయ నిబంధనలు, భారతీయ న్యాయ సంహిత ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే తరగతులు, విద్యా కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపారు.

ఫిబ్రవరి 26న లాంగ్ మార్చ్

జేఎన్‌యూఎస్‌యూ ఫిబ్రవరి 26న విద్యాశాఖ మంత్రిత్వశాఖ వరకు లాంగ్ మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉపకులపతి రాజీనామా చేయాలనే తమ డిమాండ్‌ను మరోసారి పునరుద్ఘాటించింది. ఈ ఘటనతో జేఎన్‌యూ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.