Let's talk: editor@tmv.in
జూలై నాటికి జీఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ 21 శాతం వృద్ధి

జూలై నాటికి జీఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ 21 శాతం వృద్ధి

Gaddamidi Naveen
2 ఆగస్టు, 2026

ఆంధ్రప్రదేశ్‌లో 2026 జూలై వరకు నికర జీఎస్టీ వసూళ్లు రూ.13,283 కోట్లకు చేరుకుని గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 21 శాతం వృద్ధిని నమోదు చేశాయి. దేశవ్యాప్తంగా నమోదైన సగటు వృద్ధి రేటు 17 శాతం కంటే రాష్ట్రం మెరుగైన పనితీరు కనబరిచిందని రాష్ట్ర పన్నుల ప్రధాన కమిషనర్ ఏ. బాబు తెలిపారు. ఇదే సమయంలో మొత్తం వాణిజ్య పన్నుల వసూళ్లు కూడా 20 శాతం పెరిగి రూ.20,464.7 కోట్లకు చేరినట్లు శనివారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో వెల్లడించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా నాలుగో నెల కూడా జీఎస్టీ వసూళ్లు ఏడాది ప్రాతిపదికన పెరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. 2026 జూలై నెలలో మాత్రమే నికర జీఎస్టీ వసూళ్లు రూ.3,268 కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది జూలైలో నమోదైన రూ.2,930 కోట్లతో పోలిస్తే ఇది 12 శాతం అధికం. అలాగే 2026 జూలై వరకు నికర జీఎస్టీ వసూళ్లు రూ.10,993 కోట్ల నుంచి రూ.13,283 కోట్లకు పెరగడం గమనార్హమని తెలిపారు.

మొత్తం వాణిజ్య పన్నుల వసూళ్లు కూడా గణనీయంగా పెరిగాయి. 2025 జూలై వరకు రూ.17,059.6 కోట్లుగా ఉన్న వసూళ్లు, ఈ ఏడాది అదే కాలానికి రూ.20,464.7 కోట్లకు చేరాయి. జూలై నెలలో మాత్రమే వాణిజ్య పన్నుల వసూళ్లు రూ.5,105 కోట్లుగా నమోదై, గత ఏడాది జూలైలోని రూ.4,494 కోట్లతో పోలిస్తే 14 శాతం వృద్ధిని నమోదు చేశాయి. జీఎస్టీ 2.0 కింద పన్ను రేట్ల సరళీకరణ, వ్యాపారాలకు అనుగుణంగా అనుసరణ వ్యయాలను తగ్గించే సంస్కరణలు అమల్లో ఉన్నప్పటికీ రాష్ట్రం ఈ స్థాయి వృద్ధిని సాధించడం విశేషమని వాణిజ్య పన్నుల శాఖ పేర్కొంది.

జూలై నెలలో రాష్ట్రానికి లభించిన సమగ్ర జీఎస్‌టీ సెటిల్‌మెంట్ రూ.1,993.8 కోట్లుగా నమోదైంది. ఇది గత ఏడాది జూలైతో పోలిస్తే 17.04 శాతం అధికం కాగా, రాష్ట్రానికి లభించిన మూడో అత్యధిక నెలవారీ ఐజీఎస్‌టీ సెటిల్‌మెంట్‌గా నిలిచింది. మరోవైపు పెట్రోలియం వ్యాట్ వసూళ్లు 18 శాతం పెరిగి రూ.1,686 కోట్లకు చేరగా, ఆధార్ అనుసంధానం, పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరగడం వల్ల వృత్తి పన్ను (ప్రొఫెషన్ ట్యాక్స్) వసూళ్లు 13 శాతం పెరిగి రూ.49.7 కోట్లుగా నమోదయ్యాయి.

ఇతర రాష్ట్రాలతో పోలిక

దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కూడా ఆంధ్రప్రదేశ్ మెరుగైన వృద్ధిని నమోదు చేసింది. జూలై నాటికి ఆంధ్రప్రదేశ్ సాధించిన 21 శాతం జీఎస్టీ వృద్ధి రేటు, జాతీయ సగటు (17శాతం) తో పాటు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ (19.7శాతం), తమిళనాడు (18.4శాతం), ఒడిశా (5.9శాతం) కంటే మెరుగ్గా ఉంది. అయితే కర్ణాటక (23.5శాతం), కేరళ (22.3శాతం) రాష్ట్రాలు ఏపీ కంటే అధిక వృద్ధిని నమోదు చేశాయి.

2017లో జీఎస్టీ అమలులోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఏడాది జూలై నెలలో వసూళ్లు పెరుగుతూనే ఉన్నాయని శాఖ వెల్లడించింది. పన్ను రేట్లలో విధానపరమైన తగ్గింపులు జరిగినప్పటికీ, పన్ను చెల్లింపుదారుల అనుసరణ మెరుగుపడటం, పన్ను పరిపాలన బలోపేతం కావడం వల్ల ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొంది.

కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత డేటా విశ్లేషణ, ఏఐ ఆధారిత స్క్రూటినీ, ఐజీఎస్‌టీ రివర్సల్ వ్యవస్థ, యూపీఐ ఆధారిత విశ్లేషణ, డిస్కమ్‌లతో అనుసంధానించిన నమోదు ధృవీకరణ, ఆధార్ సమీకరణ, మెషిన్ లెర్నింగ్ ఆధారిత రిస్క్ స్కోరింగ్, విభాగాల మధ్య డేటా భాగస్వామ్యం, డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహం వంటి చర్యలతో పన్ను ఎగవేతను నియంత్రించి ఆదాయాన్ని పెంచగలిగామని అధికారులు తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలంలో కూడా ఈ చర్యలను మరింత విస్తరించి ఆదాయ వృద్ధిని కొనసాగించే దిశగా చర్యలు చేపడతామని వెల్లడించారు.