
జూనియర్ హాకీ ప్రపంచ కప్ నుంచి వైదొలిగిన పాకిస్తాన్
భారతదేశంలో జరగనున్న ప్రతిష్టాత్మక ఎఫ్ఐహెచ్ పురుషుల జూనియర్ హాకీ ప్రపంచకప్ నుండి పాకిస్తాన్ తమ జట్టును ఉపసంహరించుకుంది. నవంబర్ 28 నుండి డిసెంబర్ 28 వరకు చెన్నై, మధురై నగరాలలో ఈ టోర్నమెంట్ జరగనుంది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ఈ విషయాన్ని శుక్రవారం ధృవీకరించింది. పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ తమ జట్టు ఈ ఈవెంట్లో పాల్గొనబోదని అధికారికంగా ఎఫ్ఐహెచ్కు తెలిపింది.
వైదొలగడానికి ప్రధాన కారణాలు
భారతదేశం, పాకిస్తాన్ మధ్య నెలకొన్న దౌత్య సంబంధాలలో ఉద్రిక్తతల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్తాన్ హాకీ వర్గాలు తెలిపాయి. పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో తమ క్రీడాకారుల భద్రతకు సంబంధించిన ఆందోళనలను పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ ప్రస్తావించింది. ఇటీవల జరిగిన ఆసియా కప్ క్రికెట్ సందర్భంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న హ్యాండ్షేక్ వివాదాలు, ట్రోఫీని తిరస్కరించడం వంటి సంఘటనలు ఈ నిర్ణయంపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. దీనికి ముందు బీహార్లోని రాజ్గిర్లో జరిగిన ఆసియా కప్ నుండి కూడా పాకిస్తాన్ భద్రతా కారణాల వల్ల వైదొలిగింది. భారత్, చిలీ, స్విట్జర్లాండ్లతో పాటు పాకిస్తాన్ ఈ టోర్నీలో గ్రూప్ బీలో ఉంది.
హాకీ ఇండియాకు సమాచారం లేదు
అయితే పాకిస్తాన్ వైదొలగడంపై తమకు ఎలాంటి సమాచారం లేదని హాకీ ఇండియా తెలిపింది. "పాకిస్తాన్ వైదొలిగినట్లు ఎఫ్ఐహెచ్ నుండి మాకు ఎలాంటి సమాచారం లేదు. నెలన్నర క్రితం నేను పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ అధికారులతో మాట్లాడినప్పుడు, వారు తమ భాగస్వామ్యాన్ని ధృవీకరించారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఆతిథ్య దేశంగా ఉత్తమ టోర్నమెంట్ను నిర్వహించడం మా విధి. భారత్ టైటిల్ గెలవాలని ఆశిస్తున్నాం. పాకిస్తాన్ స్థానంలో జట్టును ప్రకటించడం ఇప్పుడు ఎఫ్ఐహెచ్ నిర్ణయానికే వదిలేస్తున్నాం" అని హాకీ ఇండియా సెక్రెటరీ జనరల్ భోలనాథ్ సింగ్ తెలిపారు.
ఆసక్తికరంగా భర్తీ జట్టును ప్రకటిస్తామని ఎఫ్ఐహెచ్ ఒకవైపు చెబుతుండగా, టోర్నమెంట్లో పాల్గొనడానికి తటస్థ వేదికను ఏర్పాటు చేయాలని పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ కోరింది. రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతల కారణంగా జాతీయ జూనియర్ జట్టు భారతదేశానికి వెళ్లకూడదని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు పాక్ హాకీ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ రాణా ముజాహిద్ శుక్రవారం తెలిపారు. ఈ విషయాన్ని ఎఫ్ఐహెచ్కు తెలియజేశామని ఆయన అన్నారు.
"భారతదేశంలో ప్రధాన ఈవెంట్లు జరుగుతున్నందున వాటిని కోల్పోవడం వల్ల మా హాకీకి నష్టం జరుగుతోంది. మా క్రీడాకారుల అభివృద్ధికి సహాయపడటం లేదు. కాబట్టి జూనియర్ ప్రపంచకప్లో పాల్గొని మా మ్యాచ్లు ఆడటానికి తటస్థ వేదికను ఏర్పాటు చేయాలని మేము ఎఫ్ఐహెచ్ని కోరాం" అని రాణా ముజాహిద్ చెప్పారు.
