Let's talk: editor@tmv.in
జులైలో గోవా వేదికగా యూటీటీ సీజన్-7

జులైలో గోవా వేదికగా యూటీటీ సీజన్-7

Shaik Mohammad Shaffee
14 మార్చి, 2026

భారత టేబుల్ టెన్నిస్ రంగంలో అత్యంత ఆదరణ పొందిన 'అల్టిమేట్ టేబుల్ టెన్నిస్' (యూటీటీ) ఏడో సీజన్‌కు ముహూర్తం ఖరారైంది. ఈసారి టోర్నీ సరికొత్త వేదికగా పర్యాటక రాష్ట్రం గోవాను ఎంచుకుంది. 2026 జూలైలో గోవాలోని శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో ఈ మెగా టోర్నీ జరగనుందని నిర్వాహకులు శుక్రవారం ప్రకటించారు. 2017లో ప్రారంభమైన ఈ ఫ్రాంచైజీ ఆధారిత లీగ్, ఇప్పటివరకు ఆరు విజయవంతమైన సీజన్లను పూర్తి చేసుకుని, దేశంలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న క్రీడా లీగ్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది.

అంతర్జాతీయ స్టార్లు

టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈ లీగ్‌లో ప్రపంచస్థాయి మేటి క్రీడాకారులతో పాటు భారత అగ్రశ్రేణి ప్యాడ్లర్లు పోటీపడనున్నారు. వెటరన్ స్టార్ అచంట శరత్ కమల్‌తో పాటు యువ సంచలనాలు దియా చితాలే, మానవ్ థక్కర్, మానుష్ షా వంటి క్రీడాకారులు తమ సత్తా చాటనున్నారు. అంతర్జాతీయ క్రీడాకారులతో కలిసి ఆడటం వల్ల భారత ఆటగాళ్లకు మెరుగైన శిక్షణతో పాటు పోటీతత్వం పెరుగుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ లీగ్ ద్వారా యువ అథ్లెట్లలో స్ఫూర్తిని నింపడమే తమ ప్రధాన లక్ష్యమని టోర్నీ సహ ప్రమోటర్ విటా దానీ వెల్లడించారు.

ఒలింపిక్ పతకమే లక్ష్యంగా..

భారత టేబుల్ టెన్నిస్ వ్యవస్థలో యూటీటీ కీలక పాత్ర పోషిస్తోందని, అట్టడుగు స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు క్రీడా ప్రమాణాలను పెంచడంలో ఇది దోహదపడుతోందని విటా దానీ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఒలింపిక్ క్రీడల్లో భారత పురుషుల, మహిళల జట్టు తొలిసారి క్వాలిఫై కావడం ఈ క్రీడ సాధించిన ప్రగతికి నిదర్శనమన్నారు. భవిష్యత్తులో భారత్ టేబుల్ టెన్నిస్‌లో ఒలింపిక్ పతకాన్ని సాధించాలనే పెద్ద లక్ష్యం దిశగా యూటీటీ వంటి వేదికలు పునాది వేస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. గోవాలో జరగనున్న ఈ ఏడో సీజన్ అభిమానులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు.