
జల వివాదం: మెక్సికోకు ట్రంప్ 5 శాతం సుంకం బెదిరింపు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెక్సికోపై మరో 5 శాతం అదనపు సుంకాన్ని విధిస్తామని గట్టిగా హెచ్చరించారు. సుదీర్ఘకాలంగా ఉన్న ఒప్పందం ప్రకారం, మెక్సికో అమెరికాకు ఇవ్వాల్సిన నీటిని విడుదల చేయడంలో విఫలమైందని, దీనివల్ల టెక్సాస్ రాష్ట్రంలో వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింటోందని ట్రంప్ ఆరోపించారు. ఈ నీటి వివాదంపై వెంటనే పరిష్కారం లభించకపోతే సుంకాలు విధిస్తామని ఆయన తేల్చి చెప్పారు.
ట్రంప్ ట్రూత్ సోషల్లో చేసిన పోస్ట్లో , మెక్సికో గత ఐదేళ్లుగా ఒప్పందంలోని తన బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమైందని మండిపడ్డారు. ఈ నీటి కొరత 8 లక్షల ఎకరాల అడుగులకు (ఒక ఎకరం విస్తీర్ణంలో ఉన్న భూమిపై, ఒక అడుగు లోతు వరకు నిలిచిన నీటి పరిమాణాన్ని ఒక ఎకరం అడుగు అంటారు) చేరుకుందని, దీనివల్ల టెక్సాస్లోని పంటలు, పశువులకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డిసెంబర్ 31వ తేదీలోగా మెక్సికో కనీసం 200,000 ఎకరాల అడుగుల నీటిని అందించాలని అమెరికా డిమాండ్ చేస్తోందని, కానీ తాము అడిగినప్పటికీ మెక్సికో నుంచి సరైన స్పందన లేదని ట్రంప్ తెలిపారు. "మా అమెరికా రైతులకు ఈ నీరు చాలా అవసరం. వారికి అన్యాయం జరుగుతోంది" అని ఆయన అన్నారు. సమస్య వెంటనే పరిష్కారం కాకపోతే 5 శాతం సుంకాన్ని విధిస్తూ ముందుకు వెళ్లడానికి అవసరమైన పత్రాలపై తాను సంతకం చేశానని ట్రంప్ హెచ్చరించారు.
ఒప్పందం ఏమిటి?
ఈ వివాదం మొత్తం 1944 నాటి నీటి ఒప్పందం చుట్టూ తిరుగుతోంది. ఈ ఒప్పందం ప్రకారం, మెక్సికో రియో గ్రాండే నదిలోని ఆనకట్టలు, జలాశయాల వ్యవస్థ ద్వారా ప్రతి ఐదేళ్లకు ఒకసారి అమెరికాకు 1.75 మిలియన్ ఎకరాల అడుగుల నీటిని తప్పనిసరిగా సరఫరా చేయాలి. అయితే ఈ ఐదేళ్ల కాలం అక్టోబర్తో ముగిసింది. ఇంటర్నేషనల్ బౌండరీ అండ్ వాటర్ కమిషన్ డేటా ప్రకారం, మెక్సికో వాగ్దానం చేసిన మొత్తంలో 30 శాతం కంటే తక్కువ నీటిని మాత్రమే సరఫరా చేసింది.
అదే ఒప్పందంలో అమెరికా కూడా కొలరాడో నది నుంచి మెక్సికోకు ఏటా 1.5 మిలియన్ ఎకరాల అడుగుల నీటిని అందించాలి. అమెరికా ఈ నిబంధనను ఎక్కువగా పాటించినప్పటికీ, తీవ్రమైన కరువు కారణంగా ఈ మధ్య సరఫరా తగ్గించింది. అయితే ఒప్పందం ప్రకారం కరువు పరిస్థితుల్లో నీటి సరఫరాను తగ్గించేందుకు అమెరికాకు అనుమతి ఉంది.
మెక్సికో స్పందన
మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ ఈ వివాదంపై స్పందించారు. తాము గత మూడు సంవత్సరాలుగా తీవ్రమైన కరువు ఎదుర్కొంటున్నామని, అందుబాటులో ఉన్న నీటిని బట్టి ఒప్పందాన్ని నెరవేరుస్తున్నామని ఆమె తెలిపారు. టెక్సాస్కు నీటి సరఫరా సమస్యను పరిష్కరించడానికి స్వల్పకాలిక చర్యలను వివరిస్తూ, అమెరికా అధికారులకు తాను ఇప్పటికే ఒక ప్రతిపాదనను సమర్పించినట్లు షీన్బామ్ చెప్పారు. అలాగే మెక్సికో పర్యావరణ, వ్యవసాయ, విదేశాంగ మంత్రులను వెంటనే వారి అమెరికా సహచరులను సంప్రదించాలని ఆదేశించానని ఆమె తెలిపారు. "ఇతర సమస్యల మాదిరిగానే, ఈ విషయంలో కూడా ఒక పరిష్కారం దొరుకుతుందని నేను కచ్చితంగా అనుకుంటున్నాను" అని షీన్బామ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
