Let's talk: editor@tmv.in
జమ్మూ–శ్రీనగర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

జమ్మూ–శ్రీనగర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

Pinjari Chand
28 జనవరి, 2026

జమ్మూ–శ్రీనగర్ జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ ఒకరు సహా నలుగురు మృతి చెందారు. ఉధంపూర్‌ జిల్లాలో మైలురాయి 68 వద్ద శ్రీనగర్‌ వైపు వెళ్తున్న బస్సు, పికప్‌ ట్రక్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సీఆర్‌పీఎఫ్‌ 137వ బెటాలియన్‌ సెకండ్‌-ఇన్‌-కమాండ్‌ కర్తార్‌ సింగ్‌ వివరాల ప్రకారం, ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 52వ బెటాలియన్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ ఒకరు ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నామని, సంఘటన స్థలంలో పోలీసులు ఉన్నారని ఆయన తెలిపారు.

ప్రమాద స్థలంలో మృతదేహాలను వెలికితీసి సమీప ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా జమ్మూ–కశ్మీర్‌లోని దోడా జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భారత సైనికుడు రింకిల్‌ బాల్యాన్‌ కుటుంబాన్ని బీజేపీ ఎంపీ అరుణ్‌ గోవిల్‌, పార్టీ నేత సంజీవ్‌ బాల్యాన్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా అరుణ్‌ గోవిల్‌ మాట్లాడుతూ, రింకిల్‌ బాల్యాన్‌ కుటుంబంలోని సభ్యులందరూ సైన్యం లేదా సైన్యానికి సమానమైన దళాల్లో సేవలందిస్తున్నారని, ఇది దేశానికి గర్వకారణమని అన్నారు. వారి దుఃఖ సమయంలో తాము కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.

బీజేపీ నేత సంజీవ్‌ బాల్యాన్‌ మాట్లాడుతూ, రింకిల్‌ తనకు తమ్ముడిలాంటి వాడని, వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలు ఎప్పుడూ డిమాండ్లు చేయవని చెప్పారు. అయినప్పటికీ, కుటుంబానికి అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం ద్వారా అందిస్తామని హామీ ఇచ్చారు. దోడా జిల్లాలో జరిగిన మరో ప్రమాదంలో ఆపరేషన్‌ కోసం వెళ్తున్న సైనిక వాహనం చెడు వాతావరణం, ప్రమాదకరమైన రహదారి పరిస్థితుల కారణంగా అదుపు తప్పి లోయలో పడిపోయినట్లు వైట్‌ నైట్‌ కార్ప్స్‌ తెలిపింది. ఈ ఘటనలో రింకిల్‌ బాల్యాన్‌తో పాటు మరి తొమ్మిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన వెంటనే సైన్యం, స్థానిక యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఇటీవల జనవరి 22వ తేదీన జమ్మూ-కశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఒక భారీ సైనిక వాహనం ప్రమాదానికి గురైంది. సుమారు 200 అడుగుల లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంల కనీసం 10 మంది భారత ఆర్మీ జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే.