
జమ్మూలో ఐఐటీ విస్తరణకు శ్రీకారం
జమ్మూలో ఐఐటీ విస్తరణకు ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారని, ఇది గర్వించదగ్గ విషయమని కేంద్రసహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. శనివారం ఒడిశాలోని జార్సుగూడలో ప్రధాని మోడీ తిరుపతి, పాలక్కాడ్, భిలాయ్, జమ్మూ, ధార్వాడ్, జోధ్పూర్, పాట్నా, ఇండోర్లో దాదాపు రూ.11,000 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న ఎనిమిది ఐఐటీల విస్తరణకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. దీని వల్ల రాబోయే నాలుగు సంవత్సరాలలో 10,000 మంది కొత్త విద్యార్థులకు అవకాశం దక్కనుంది. అలాగే ఇక్కడ ఎనిమిది అత్యాధునిక పరిశోధనా పార్కులను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
ప్రజల డిమాండ్ మేరకు
ఈ సందర్భంగా జితేందర్ సింగ్ మాట్లాడుతూ 2014 ముందు నుంచే ఇక్కడ ఐఐటీ ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. శ్రీనగర్ లోని ఇంజనీరింగ్ కళాశాలను ఎన్ఐటీగా మార్చారు. తదనంతరం ప్రజలు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థను ఏర్పాటు చేయాలని కోరారు. అందుకనుగుణంగా అప్పటి మంత్రి, దివంగత నాయకుడు అరుణ్ జైట్లీ జమ్మూకు ఓ ఐఐటీ మంజూరు చేశారు. ఇది చాలా అభివృద్ధి చెందింది. నేషనల్ ఇన్సిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్ సూచికలో ఈ సంస్థ టాప్–60 ఇంజినీరింగ్ సంస్థలలో ఒకటిగా నిలిచింది. ఇటువంటి ఉన్నత విద్యాసంస్థలతో జమ్మూ వేగంగా అభివృద్ధి చెందుతుండడం గర్వకారణమన్నారు. ఐఐటీ మద్రాస్ లో ఉన్నట్లు ఐఐటీ జమ్మూలో కూడా ఓ పరిశోధనా పార్కును ఏర్పాటు చేస్తామని కేంద్ర సహయమంత్రి తెలిపారు. ఈ విధంగా ఏర్పాటు చేయడం ఉత్తర భారతదేశంలో తొలిసారని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధాని ఒడిశాలో 50,000 కోట్లకు పైగా టెలికమ్యూనికేషన్స్, రైల్వేలు, ఉన్నత విద్య, ఆరోగ్య సంరక్షణ, నైపుణ్యాభివృద్ధి, గ్రామీణ గృహ నిర్మాణ రంగాలలో అభివృద్ధి పనులను ప్రారంభించారని, శంకుస్థాపనలు చేశారని తెలిపారు.
