
జనసేన కమిటీల నిర్మాణం, కూర్పుపై కసరత్తు
జనసేన కార్యకర్తలకు రాజకీయ కార్యదర్శి జనసేన కేంద్ర కార్యాలయం, మంగళగిరి ఒక నోటు జారీచేసింది ఇందులో జనసేన కమిటీల నిర్మాణం, కూర్పుపై కసరత్తు, నియోజక వర్గాల్లో పార్టీ బలోపేతంపై, కార్యక్రమాల నిర్వహణపై కార్యకర్తల మనోగతం నమోదు అనే అంశాలను ప్రచురించింది. అందులో ఈ క్రింది విషయాలు ప్రస్తావించింది…….
నియోజక వర్గాల్లో పార్టీ బలోపేతంపై, కార్యక్రమాల నిర్వహణపై కార్యకర్తల మనోగతం నమోదు అనే కార్యక్రమాన్ని జనసేన పార్టీ ప్రారంభించింది. దీనిని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిశితంగా పరిశీలిస్తున్నారు.
జనసిన పార్టీ కమిటీలలో పలు మార్పుచేర్పుల ప్రక్రియ వేగవంతమవుతోంది. కమిటీల నిర్మాణం, వాటి కూర్పుపై పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యులకు దిశా నిర్దేశం చేశారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహణ, కార్యకర్తల మనోభావాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని స్పష్టం చేశారు. జిల్లాల్లో పార్టీ బలోపేతంపై చర్చించారు. ముఖ్యంగా ఉమ్మడి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో బలమైన శ్రేణులు ఉన్నాయని, అక్కడ నాయకత్వాన్ని మరింత పటిష్టం చేసి, పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని నిర్ణయించారు.
పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఇచ్చిన ఆదేశాలను అనుసరించి, పార్టీ కేంద్ర కార్యాలయ బృందం వివిధ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, వీర మహిళలతో చర్చిస్తోంది. వారి మనోగతాన్ని, అందిస్తున్న సూచనలను నమోదు చేస్తున్నారు. రాజకీయ పరిస్థితులతోపాటు పాలనాపరమైన అంశాలపై క్షేత్ర స్థాయిలో ప్రజల్లో ఉన్న అభిప్రాయాలూ కూడా పార్టీ శ్రేణులు తెలియచేస్తున్నాయి. ఆ నివేదికలను పవన్ కళ్యాణ్ నిశితంగా పరిశీలన చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, వీర మహిళలతో చర్చించి నివేదికలు ఇవ్వాలని కేంద్ర కార్యాలయ బృందానికి స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ నుంచి జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీల వరకూ నిర్మాణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలన్నారు.
