
జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం..
జనగామ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి వరంగల్ జాతీయ రహదారిపై వెళ్తున్న (TG 03Z 0046) నెంబర్ గల టీజీఎస్ఆర్టీసీ రాజధాని బస్సు, జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం, నిడిగొండ ప్రాంతంలో రహదారి పక్కనే నిలిపి ఉంచిన ఇసుక లారీని ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.ఈ బస్సులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.మరో ఆరుగురికి గాయాలయ్యాయి.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు నవజిత్ సింగ్, హన్మకొండ, బాలసముద్రం. ఓమ్ ప్రకాష్ హైదరాబాద్, దోమలగూడకుగా గుర్తించారు.అయితే గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.బస్సు వేగంగా వస్తుండగా రహదారి పక్కన నిలిపిన లారీని గమనించకపోవడం వల్ల ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. హైవేలపై రాత్రి వేళల్లో నిలిపి ఉంచే వాహనాలకు సరైన హెచ్చరికలు లేకపోవడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
