
జగిత్యాలలో బతికుండగానే సమాధి నిర్మించుకున్న వృద్ధుడు
మరణానికి సిద్ధమవ్వడం చాలామందికి భయాన్ని కలిగించే విషయం కానీ తెలంగాణలోని జగిత్యాల జిల్లా లక్ష్మీపురం గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధుడు నక్క ఇంద్రయ్య ఆరోగ్యంగా జీవిస్తూ ఉండగానే తన తన సమాధిని ముందుగానే నిర్మించుకున్నారు. ఈ సమాధిని ఆయన తన భార్య సమాధి పక్కనే నిర్మించగా, అక్కడ జీవితం–మరణం సత్యాలపై సందేశం ఉండే శిలాఫలకాన్ని కూడా ఏర్పాటు చేశారు. గ్రానైట్తో పూర్తిగా నిర్మించిన ఈ సమాధి సుమారు 5 అడుగుల లోతు, 6 అడుగులకుపైగా పొడవు కలిగి ఉంది. కాలక్రమేణా పాడవకుండా ఉండేలా దీన్ని రూపొందించారు. దీని కోసం సుమారు రూ.12 లక్షల ఖర్చు అయ్యిందని, తమిళనాడుకు చెందిన మేస్త్రీల సహాయంతో పనులు పూర్తయ్యాయని తెలిపారు.
చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన ఇంద్రయ్య జీవితం కష్టాల్లోనే సాగింది. తొలుత కూలీగా పనిచేసి, ఆ తర్వాత దుబాయ్లో నిర్మాణ రంగంలో సుమారు 45 సంవత్సరాలు పనిచేశారు. కొన్నేళ్ల క్రితం భార్య మృతి చెందడంతో స్వగ్రామానికి తిరిగివచ్చారు. నలుగురు పిల్లల తండ్రైన ఇంద్రయ్య, తన కుటుంబంలో ఇప్పటివరకు తొమ్మిది మంది వివాహాలను చేశానని చెప్పారు. తన మరణానంతరం పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ముందుగానే సమాధి నిర్మించుకున్నానని తెలిపారు. తత్వచింతనతో మాట్లాడుతూ మరణం తప్పనిసరి. ఎవ్వరూ తమ సంపదను తమతో తీసుకెళ్లలేరు అని ఇంద్రయ్య అన్నారు.
ఆనందంగా ఉంది
నేను నాలుగు–ఐదు ఇళ్లు, ఒక పాఠశాల, ఒక చర్చిని నిర్మించాను. ఇప్పుడు నా సమాధిని కూడా నిర్మించుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. సమాధి కట్టడం చాలామందికి బాధ కలిగించే విషయం కావచ్చు, కానీ నాకు ఆనందంగా ఉందని ఇంద్రయ్య మీడియాకు చెప్పారు. సమాధి నిర్మించిన ప్రదేశాన్ని ప్రతిరోజూ సందర్శించడం తన దినచర్యగా మారిందని ఆయన తెలిపారు. అక్కడి పరిసరాలను శుభ్రం చేయడం, మొక్కలకు నీళ్లు పోయడం, కొంతసేపు అక్కడ కూర్చోవడం చేస్తుంటానని చెప్పారు.
