
జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు సుప్రీంలో ఎదురుదెబ్బ
బాలీవుడ్ హీరోయిన్, శ్రీలంకన్ నటి జాక్వెలిన్ ఫెర్నండెజ్ కు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. అర్థిక నేరస్థుడైన సుకేశ్ చంద్రశేఖర్ తో కలిసి దాదాపు రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో తన పేరును తొలగించాలని దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, అగనస్టిన్ జార్జ్ మసీహ్ లతో కూడిన ధర్మాసనం కేసు ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఆమె చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ను రద్దు చేయాలన్న ఆమె వినతిని కోర్టు తిరస్కరించింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు పై స్టే ఇవ్వడం కానీ, రద్దు చేయడం కానీ వీలుకాదని ఆ ఉత్తర్వే అమల్లో ఉంటుందని తేల్చిచెప్పింది.
జాక్వెలిన్ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. జాక్వెలిన్ అనేక సార్లు ఈడీ విచారణకు హజరైంది. ఈ కేసులో తనపై ఆరోపణలు రావడంతోనే తన పేరును చేర్చారని, నాకు ఎటువంటి సంబంధం లేదని, కేసును కొట్టి వేయాలని ఈ సందర్బంగా ఆమె కోర్టును కోరింది. అయితే న్యాయమూర్తి దత్తా మాట్లాడుతూ చంద్రశేఖర్ కు ఆమె సహయపడిందని, రూ.200 కోట్ల అక్రమార్జనలో తన పాత్ర కూడా ఉందని వాదించారు. ఆమె అండ లేకుంటే అతను ఇంత చేసేవాడు కాదని తెలిపారు. ఇద్దరూ మంచి స్నేహితులని, ఇప్పుడు తమకు సంబంధం లేదంటే ఎలా అని వ్యాఖ్యానించారు.
కోర్టు నుంచి జాక్వెలిన్ వ్యతిరేకంగా తీర్పు రావడంతో ఆమెకు మరిన్ని ఇబ్బందులు తప్పవనే చర్చ నడుస్తోంది. అయితే ఆమెకు ఇంకా అప్పీల్, బెయిల్ కోసం కోర్టును సంప్రదించే అవకాశం ఉందని న్యాయవాదులు పేర్కోన్నారు. అయితే జూలైలో హైకోర్టు ఆమె పిటిషన్ తిరస్కరించడంతో ఆమె సుప్రీంని ఆశ్రయించింది. ఫార్మా కంపెనీ అయిన రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లైన శివిందర్ సింగ్, మల్వీందర్ సింగ్ భార్యలను సుకేశ్ రూ.200 కోట్లకు పైగా మోసం చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ అతడిని అరెస్ట్ చేసింది. విచారణలో జాక్వెలిన్ పేరు కూడా వెలుగులోకి వచ్చింది. ఈమెకు ఖరీదైన కానుకలు ఇచ్చినట్లు అతడు రిమాండ్ లో తెలపడంతో ఈమెను కూడా ఈడీ విచారిస్తున్న విషయం తెలిసిందే.
