Let's talk: editor@tmv.in
చేవెళ్ల బస్ దుర్ఘటనపై ఎన్‌హెచ్ఆర్సీ స్వయంప్రేరిత విచారణ

చేవెళ్ల బస్ దుర్ఘటనపై ఎన్‌హెచ్ఆర్సీ స్వయంప్రేరిత విచారణ

Gaddamidi Naveen
5 నవంబర్, 2025

రంగారెడ్డి జిల్లా చెవెళ్లలో జరిగిన ఘోర బస్ ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అనేక ప్రాణాలు బలిగొన్న ఈ దుర్ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్ఆర్సీ) సీరియస్‌గా స్పందించింది. కేసును స్వయంప్రేరితంగా (సుమోటో)గా స్వీకరించి, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

ఎన్‌హెచ్ఆర్సీ అధికారులు ఈ ఘటనలో రోడ్డు భద్రతా చర్యల్లో తీవ్ర నిర్లక్ష్యం చోటుచేసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. బస్సు యాజమాన్యం నిర్లక్ష్యం, డ్రైవర్‌ వేగం, వాహనం సాంకేతిక లోపం వంటి అంశాలను పరిశీలించాలని సూచించారు. అలాగే గాయపడిన వారికి తగిన వైద్య సహాయం, మరణించిన వారి కుటుంబాలకు తక్షణ పరిహారం అందించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.

కమిషన్‌ ఈ ప్రమాదాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించింది. ప్రజల ప్రాణ భద్రత పట్ల అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రోడ్ల నాణ్యత, బస్సుల సాంకేతిక తనిఖీలు, డ్రైవర్ల శిక్షణలో కఠిన నియమాలు పాటించాలని సూచించింది.

ఈ ఘటనతో రోడ్డు భద్రతపై మళ్లీ చర్చ మొదలైంది. ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణించే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరి కావాలని ప్రజలు కోరుతున్నారు. ఎన్‌హెచ్ఆర్సీ జోక్యం వల్ల బాధిత కుటుంబాలకు కొంత న్యాయం జరుగుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

చేవెళ్ల బస్ దుర్ఘటనపై ఎన్‌హెచ్ఆర్సీ స్వయంప్రేరిత విచారణ - Tholi Paluku