
చలి గుప్పిట్లో కాశ్మీరం.. మైనస్ డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
కాశ్మీర్ లోయలో 2007వ సంవత్సరం తర్వాత అత్యంత చల్లని నవంబర్ నెల నమోదవుతోందని అధికారులు శుక్రవారం తెలిపారు. లోయలోని అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల కంటే చాలా కిందకు పడిపోయాయి. శ్రీనగర్లో గత రాత్రి ఈ సీజన్లోనే అత్యంత చల్లని రాత్రిగా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 4.5 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంది. అంతకుముందు రోజు రాత్రి మైనస్ 4.4 డిగ్రీలు ఉండగా, అది మరింత పడిపోయింది. గత కొన్ని రోజులుగా శ్రీనగర్లో రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత సీజన్లో ఉండాల్సిన సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఈ చలి నాలుగు డిగ్రీలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అధికారుల ప్రకారం, లోయలోని అనేక ప్రాంతాలలో 2007 తర్వాత నవంబర్లో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత. 2007, నవంబర్ 28న శ్రీనగర్లో మైనస్ 4.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, శ్రీనగర్లో నవంబర్లో నమోదైన అత్యంత తక్కువ ఉష్ణోగ్రత (ఆల్టైమ్ లోయెస్ట్) మైనస్ 7.8 డిగ్రీలు. ఇది 1934లో నమోదైంది.
లోయలో అత్యంత శీతల ప్రదేశం
దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని కోనిబల్ గత రాత్రి (గురువారం) లోయలో అత్యంత శీతలమైన ప్రాంతంగా నమోదైంది. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 6 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. లోయకు గేట్వే అయిన ఖాజీగుండ్లో ఉష్ణోగ్రత మైనస్ 4.4 డిగ్రీలు, ఉత్తర కాశ్మీర్లోని కుప్వారాలో మైనస్ 4.8 డిగ్రీలు నమోదైంది. పహల్గామ్ పర్యాటక ప్రాంతంలో మైనస్ 5.5 డిగ్రీలు, గుల్మార్గ్లో మైనస్ 1.4 డిగ్రీలు, కోకెర్నాగ్లో మైనస్ 1.8 డిగ్రీలు నమోదయ్యాయి. డిసెంబర్ 10 వరకు కాశ్మీర్ అంతటా ప్రధానంగా పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని కారణంగా రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది.
