
చండీగఢ్ ‘కేంద్రం’గా పంజాబ్ లో ‘దుమారం’
చండీగఢ్ పరిపాలనపై కేంద్రం చేసిన తాజా ప్రతిపాదన పంజాబ్లో రాజకీయ అలజడి రేపింది. చండీగఢ్ను రాజ్యాంగంలోని ఆర్టికల్ 240 పరిధిలోకి చేర్చే యత్నమంటూ రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కేంద్రంపై విరుచుకుపడ్డాయి. అయితే వివాదం తీవ్ర దుమారానికి కారణం కావడంతో కేంద్రం వెంటనే దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.“శీతకాల సమావేశాల్లో ఇందుకు సంబంధించిన ఎలాంటి బిల్లూ తీసుకురావడం లేదు. ప్రస్తుత పరిపాలనా నిర్మాణం మారదు అని స్పష్టం చేసి రాజకీయ ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నం చేసింది.
లోక్సభ, రాజ్యసభ బులెటిన్ ప్రకారం, చండీగఢ్ కేంద్ర భూభాగాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 240 పరిధిలోకి చేర్చాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ బిల్లు ఆమోదం పొందితే, గతంలో స్వతంత్ర ప్రధాన కార్యదర్శి ఉన్నట్లే, చండీగఢ్కు కూడా స్వతంత్ర నిర్వాహకుడు ఉండే అవకాశం ఉంది. చండీగఢ్, పంజాబ్, హర్యానాలకు ఉమ్మడి రాజధానిగా పనిచేస్తుంది. ఈ ప్రతిపాదిత సవరణ పంజాబ్లో రాజకీయ ఆగ్రహాన్ని రేకెత్తించింది. అధికార ఆప్, కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ బిజెపి నేతృత్వంలోని కేంద్రాన్ని విమర్శిస్తూ, ప్రభుత్వం పంజాబ్ నుంచి చండీగఢ్ను ‘లాగేసుకోవడానికి’ ప్రయత్నిస్తోందని ఆరోపించాయి.
కేజ్రీవాల్ ఘాటు విమర్శ
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్రం ప్రతిపాదిత చర్యను తీవ్రంగా వ్యతిరేకించారు. ‘రాజ్యాంగ సవరణ ద్వారా చండీగఢ్పై పంజాబ్ హక్కులను తొలగించాలని బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం సాధారణ చర్యలో భాగం కాదు. పంజాబ్ గుర్తింపు, రాజ్యాంగ హక్కులపై ప్రత్యక్ష దాడి. సమాఖ్య నిర్మాణాన్ని అణగదొక్కడం, పంజాబీల హక్కులను హరించే ఈ మనస్తత్వం చాలా ప్రమాదకరమైనది’ అని కేజ్రీవాల్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
దేశ భద్రత, ఆహారం, నీరు మానవత్వం కోసం ఎల్లప్పుడూ త్యాగం చేసిన పంజాబ్, నేడు దాని వాటాను కోల్పోతోంది. ఇది కేవలం పరిపాలనా నిర్ణయం మాత్రమే కాదు, పంజాబ్ ఆత్మను గాయపరచడంతో సమానం.పంజాబీలు ఏ నియంతృత్వ పాలన ముందు ఎప్పుడూ తలవంచలేదని అందుకు చరిత్ర సాక్ష్యంగా ఉంది. పంజాబ్ నేటికీ తలవంచదు. చండీగఢ్ పంజాబ్ కు చెందినది, పంజాబ్ తోనే ఉంటుంది అని ఆయన అన్నారు.
పార్లమెంట్ లో అడ్డుకుంటాం: శిరోమణి అకాలీదళ్
‘ఈ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న ప్రతిపాదిత రాజ్యాంగ (131వ సవరణ) బిల్లును శిరోమణి అకాలీదళ్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ సవరణతో చండీగఢ్ ఒక రాష్ట్రంగా మారుతుంది. పంజాబ్ చండీగఢ్పై తన హక్కును పూర్తిగా కోల్పోతుంది అని శిరోమణి అకాలీదళ్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ అన్నారు. ఈ ప్రతిపాదనను పంజాబ్కు కోలుకోలేని దెబ్బగా అభివర్ణించారు, కాంగ్రెస్ పార్టీ మొదట్లో పంజాబ్ నుంచి చండీగఢ్ను స్వాధీనం చేసుకుందని, దానిని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలనే నిర్ణయాన్ని అంగీకరించబోమని నొక్కి చెప్పారు. శిరోమణి అకాలీదళ్ దీనిని జరగనివ్వదు. ఈ సమావేశాల్లో దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది’ అని ఆమె అన్నారు.
నేడు అత్యవసర సమావేశం
ఈ అంశంపై చర్చించడానికి నవంబర్ 24న శిరోమణి అకాలీదళ్ తన కోర్ కమిటీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ అధ్యక్షత వహించే ఈ సమావేశంలో తదుపరి దశలను రూపొందిస్తామని నాయకుడు దల్జిత్ సింగ్ చీమా తెలిపారు. కేంద్రం చర్యను ఎదుర్కోవడానికి సీనియర్ రాజ్యాంగ నిపుణులను సంప్రదిస్తామని ఆయన అన్నారు.
పంజాబ్ లో విభజనలను సృష్టించడం మానేయాలి
తాజా రాజ్యాంగ సవరణ బిల్లు పంజాబ్లో అస్థిరతను సృష్టించడానికి రూపొందించిన మరో చర్య అని కాంగ్రెస్ నాయకుడు ప్రతాప్ బజ్వా ఆరోపించారు. మన హక్కులపై ఇలాంటి దాడిని పంజాబీలు పూర్తి శక్తితో వ్యతిరేకిస్తారని వారికి తెలుసు. ఈ ఘర్షణ రాష్ట్రంలో గవర్నర్ పాలన కోసం ఒత్తిడి తీసుకురావడానికి బిజెపికి ఒక సాకును అందిస్తుంది. పంజాబ్లో విభజనలను సృష్టించడం మానేయాలని సలహా ఇస్తున్నాను అని బజ్వా అన్నారు.
నియంతృత్వం ద్వారా స్వాధీనం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది
చండీగఢ్లో స్వతంత్ర నిర్వాహకుడిని నియమించాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా కూడా విమర్శించారు, ఈ చర్య పంజాబ్ను "అంతం" చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.
ఆనంద్పూర్ సాహిబ్లో మీడియాతో మాట్లాడిన చీమా, బిజెపి పంజాబ్ను నియంతృత్వం ద్వారా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం గతంలో భాక్రా బియాస్ మేనేజ్మెంట్, చండీగఢ్లోని పంజాబ్ విశ్వవిద్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించిందన్నారు. ఇప్పుడు రద్దు చేయబడిన మూడు నల్ల చట్టాలను ప్రవేశపెట్టిందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయత్నాలన్నింటినీ పంజాబ్లోని ధైర్యవంతులైన ప్రజలు అడ్డుకున్నారు అని ఆయన నొక్కి చెప్పారు.
అఖిలపక్షం ఏర్పాటు చేయాలి
పంజాబ్ నుంచి చండీగఢ్ను పూర్తిగా లాక్కొని ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడమే కేంద్రం తాజా ప్రయత్నం అని కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్గత్ సింగ్ అన్నారు. ఈ చర్యను పంజాబ్ ఎప్పటికీ అంగీకరించని దూకుడు చర్య అని ఆయన అభివర్ణించారు. సోమవారం జరిగే అసెంబ్లీ సమావేశంలో ఈ పంజాబ్ వ్యతిరేక చర్యను తీవ్రంగా వ్యతిరేకించి, దానికి వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించాలని నేను ముఖ్యమంత్రి భగవంత్ మాన్ను కోరుతున్నాను. పంజాబ్ ఐక్యంగా నిలబడటానికి, పార్లమెంటు సమావేశానికి ముందు ఢిల్లీకి వెళ్లి, ఈ రాజ్యాంగ విరుద్ధమైన దాడికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయడానికి, పంజాబ్ అభ్యంతరాన్ని అధికారికంగా నమోదు చేయడానికి అఖిలపక్ష ప్రతినిధి బృందంతో రాష్ట్రపతిని కలవడానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి" అని సింగ్ అన్నారు.
చండీగఢ్ పరిపాలన – నేపథ్యం
ప్రస్తుతం పంజాబ్ గవర్నరే చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్.
1966లో పునర్వ్యవస్థీకరణ తర్వాత చండీగఢ్కు ప్రత్యేకంగా చీఫ్ సెక్రటరీ ఉండేవారు.
1984నుంచి గవర్నర్ ఆధ్వర్యంలో పరిపాలన.
2016లో కేంద్రం ఐఏఎస్ అధికారి కేజే అల్ఫోన్స్ను స్వతంత్ర అడ్మినిస్ట్రేటర్గా పెట్టాలని చూసినా— అన్ని పార్టీల వ్యతిరేకతతో వెనక్కి వెళ్లింది.
