
గ్లోబల్ ఐటీ దిగ్గజాలకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు
అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ ది హార్ట్ఫోర్డ్ భారత్లో తొలి అడుగుగా హైదరాబాద్లో గ్లోబల్ టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించింది. సోమవారం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ఈ కేంద్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. భారత్లో కంపెనీకి ఇదే మొదటి సాంకేతిక కేంద్రం కావడం విశేషం.
హైదరాబాద్ ఐటీ హబ్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో 1.60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సౌకర్యవంతమైన కేంద్రం ఏర్పాటు చేయబడింది. రాబోయే కొన్నేళ్లలో ఈ కేంద్రంలో సుమారు 1,200 మంది ఉద్యోగులను నియమించుకునే లక్ష్యంతో సంస్థ ముందుకు సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా తమ కార్యకలాపాలకు అవసరమైన ఆధునిక డిజిటల్ సాంకేతికతలు, ఇంజినీరింగ్ పరిజ్ఞానం, కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత సామర్థ్యాలను విస్తరించేందుకు ఈ కేంద్రం కీలకంగా ఉండనుంది.
ఈ గ్లోబల్ టెక్నాలజీ సెంటర్ సంస్థ యొక్క ఎంటర్ప్రైజ్ స్థాయి టెక్నాలజీ ట్రాన్స్ఫార్మేషన్ యాత్రకు మద్దతు ఇస్తుంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఇన్నోవేషన్, ఇంజినీరింగ్ నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది. స్టార్టప్ తరహా వాతావరణంలో రూపుదిద్దుకున్న ఈ కేంద్రం వేగవంతమైన ప్రోటోటైపింగ్కు అనుకూలంగా ఉండటంతో పాటు, అమెరికాలోని హార్ట్ఫర్డ్, షార్లెట్, చికాగో, కొలంబస్ నగరాల్లో ఉన్న సంస్థ టెక్నాలజీ హబ్లతో సమన్వయంగా పనిచేసేలా రూపకల్పన చేయబడింది.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, భారత్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు హైదరాబాద్ను ఎంచుకోవడం ఒక సానుకూల ధోరణిగా పేర్కొన్నారు. గతంలో మైక్రోసాఫ్ట్ అమెరికా వెలుపల తమ మొదటి ప్రధాన డెవలప్మెంట్ సెంటర్ను హైదరాబాద్లోనే ఏర్పాటు చేసిందని, అలాగే గూగుల్ కూడా తన అతిపెద్ద క్యాంపస్ను ఇక్కడే ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. ఇటీవల సంవత్సరాల్లో మెక్డొనాల్డ్స్, వ్యాన్గార్డ్, దై-ఇచి లైఫ్, మారియట్ ఇంటర్నేషనల్ వంటి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల కోసం హైదరాబాద్నే ఎంచుకున్నాయని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లో మేము సాధించే విజయాన్ని, గ్లోబల్ సంస్థలు సృష్టించే ప్రభావంతో కొలుస్తాము. డిజిటల్ ఆవిష్కరణల తదుపరి అధ్యాయాన్ని నిర్మించడంలో ది హార్ట్ఫర్డ్ భాగస్వామిగా మారడాన్ని స్వాగతిస్తున్నాం, అని మంత్రి పేర్కొన్నారు.
ది హార్ట్ఫోర్డ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శేఖర్ పన్నాల మాట్లాడుతూ.. హైదరాబాద్లోని టాలెంట్ ఈ కేంద్రాన్ని ఒక అయస్కాంతంలా ఆకర్షిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేవలం కొత్త డిజిటల్ సామర్థ్యాలను సృష్టించడమే కాకుండా, ఇన్సూరెన్స్ టెక్నాలజీ భవిష్యత్తును ఇక్కడి నుండే మారుస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న మద్దతు, ఇక్కడి మౌలిక సదుపాయాలు అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఐటీ శాఖ వెల్లడించింది.
