
గ్రీన్లాండ్పై ట్రంప్ చూపు.. ఇచ్చేది లేదన్న డెన్మార్క్
ప్రపంచంలోనే అతిపెద్ద దీవి అయిన 'గ్రీన్లాండ్'ను దక్కించుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలో ఎలాంటి మార్పు లేదని డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్టె ఫెడరిక్సన్ స్పష్టం చేశారు. మ్యూనిచ్ భద్రతా సదస్సులో భాగంగా జరిగిన చర్చా వేదికలో ఆమె మాట్లాడుతూ.. గ్రీన్లాండ్ అంశంపై ట్రంప్ చాలా తీవ్రంగా (సీరియస్) ఉన్నారని అభిప్రాయపడ్డారు. 2025లో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రంప్ ఈ ప్రతిపాదనను పదేపదే తెరపైకి తెస్తుండటం ఐరోపా అంతటా చర్చనీయాంశంగా మారింది.
ప్రజాభీష్టమే ముఖ్యం
సార్వభౌమ దేశాలను, ప్రజల స్వయం నిర్ణయాధికారాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఫెడరిక్సన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. గ్రీన్లాండ్ ప్రజలు అమెరికన్లుగా మారడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదని, వారు తమ నిర్ణయాన్ని స్పష్టంగా వెల్లడించారని ఆమె నొక్కి చెప్పారు. గ్రీన్లాండ్ ప్రస్తుతం డెన్మార్క్ దేశంలో స్వయం ప్రతిపత్తి కలిగిన భూభాగం అయినప్పటికీ, దాని రక్షణ, విదేశీ వ్యవహారాలను మాత్రం డెన్మార్క్ పర్యవేక్షిస్తోంది.
రక్షణ అంశాలపై వర్కింగ్ గ్రూపు
ఆర్కిటిక్ ప్రాంతంలో అమెరికాకు ఉన్న భద్రతాపరమైన ఆందోళనలను పరిష్కరించేందుకు అమెరికా-డెన్మార్క్-గ్రీన్లాండ్ ప్రతినిధులతో కూడిన ఒక ప్రత్యేక 'వర్కింగ్ గ్రూపు' ఏర్పాటైంది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే కొన్ని రెడ్ లైన్స్ దాటడం సాధ్యం కాదని, తమ వ్యూహానికే కట్టుబడి ఉంటామని ప్రధాని ఫెడరిక్సన్ తేల్చి చెప్పారు. గత నెలలో స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన చర్చల్లో.. గ్రీన్లాండ్ను సైనిక బలంతో ఆక్రమించే ప్రసక్తే లేదని ట్రంప్ ప్రకటించడంతో ఉద్రిక్తతలు కొంత తగ్గుముఖం పట్టాయి.
తగ్గిన వాణిజ్య ఉద్రిక్తతలు
గ్రీన్లాండ్ వివాదం నేపథ్యంలో ఎనిమిది ఐరోపా దేశాలపై అదనపు సుంకాలు (టారిఫ్స్) విధిస్తామన్న పాత హెచ్చరికల నుంచి ట్రంప్ వెనక్కి తగ్గారు. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో జరిగిన సమావేశం తర్వాత, ఆ సుంకాల విధింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించడం విశేషం. ఏది ఏమైనా, గ్రీన్లాండ్ను 'కొనుగోలు' చేయాలనే ట్రంప్ ఆశయం మాత్రం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది.
