Let's talk: editor@tmv.in
గోహ్‌పూర్‌లో ఏఐ, డ్రోన్లతో కొత్త భవిష్యత్‌కు నాంది

గోహ్‌పూర్‌లో ఏఐ, డ్రోన్లతో కొత్త భవిష్యత్‌కు నాంది

Pinjari Chand
9 నవంబర్, 2025

ఈశాన్య భారత విద్యా రంగంలో మరో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. అసోం రాష్ట్రంలోని గోహ్‌పూర్‌లో స్వహీద్‌ కనకలత బరూ రాష్ట్ర విశ్వవిద్యాలయానికి శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శంకుస్థాపన వేశారు. రూ. 415 కోట్లతో రూపుదిద్దుకోబోతున్న ఈ విశ్వవిద్యాలయం అసోం రాష్ట్రంలోనే మొదటి టెక్నాలజీ అండ్‌ ఒకేషనల్‌ ఎడ్యుకేషన్‌ ట్రైనింగ్‌ (టీ–వెట్) యూనివర్సిటీ. ఇది ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), సైబర్‌ సెక్యూరిటీ, డ్రోన్‌ టెక్నాలజీ, క్వాంటం కంప్యూటింగ్‌ వంటి భవిష్యత్‌ సాంకేతిక రంగాల్లో నైపుణ్యాన్ని పెంపొందించే కేంద్రంగా నిలుస్తుంది. స్వాతంత్ర్య సమరయోధురాలు స్వహీద్‌ కనకలత బరూ జ్ఞాపకార్థం ఈ విశ్వవిద్యాలయం నిర్మించడం అత్యంత సార్థకమని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. కేవలం 17 ఏళ్ల వయసులో దేశ జెండా గౌరవార్థం ప్రాణత్యాగం చేసిన కనకలత స్ఫూర్తి అమోఘం. ఆమె పేరుతో విశ్వవిద్యాలయం స్థాపన ఆమెకు సరైన నివాళి. ఇది చాలా కాలం క్రితమే జరగాల్సింది అని మంత్రి గుర్తు చేశారు. ఈ విశ్వవిద్యాలయం ద్వారా యువత నైపుణ్య ఆధారిత విద్యను పొందుతూ పరిశ్రమల అవసరాలకు తగిన విధంగా సన్నద్ధం అవుతారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈశాన్య విద్యా రంగానికి 21 వేల కోట్ల పెట్టుబడి

కేంద్రమంత్రి సీతారామన్‌ తెలిపిన వివరాల ప్రకారం 2014 నుంచి ఇప్పటివరకు ఈశాన్య భారత విద్యా రంగ అభివృద్ధికి రూ.21,000 కోట్లు కేంద్రం కేటాయించింది. అసోం రాష్ట్రంలోనే 850కి పైగా కొత్త పాఠశాలలు స్థాపించింది. 15 మెడికల్‌ కాలేజీలు, 200 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్లు ఏర్పాటయ్యాయి. అదనంగా దేశంలోనే మొదటి స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఈశాన్యంలో నిర్మాణంలో ఉంది. మిజోరంలోని ఐజవాల్‌లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ ఇప్పటికే ప్రారంభమైంది. అలాగే గువాహటిలో కొత్త ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఆవిష్కరణ కానుంది. ఇది అసోంకు మొదటిది, ఈశాన్యానికి రెండోది.

కనెక్టివిటీలో చారిత్రక ముందడుగు

11 ఏళ్లలో ఈశాన్య రాష్ట్రాల్లో 10 కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాలు నిర్మించాం. స్వాతంత్ర్యం తర్వాత 75 ఏళ్ల తరువాత తొలిసారిగా గూడ్స్ రైళ్లు 2022లో మణిపూర్‌, 2023లో మేఘాలయ రాష్ట్రాలకు చేరాయి. ఇది నిజంగా చరిత్రాత్మక ఘట్టం అని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఈ అభివృద్ధి పనులన్నీ ఈశాన్య ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడానికేనని ఆమె స్పష్టం చేశారు.

ఆత్మనిర్భర్‌ భారత్‌ వైపు మరో అడుగు: అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ

స్వహీద్‌ కనకలత బరూ ధైర్యం, దేశభక్తి మనకు శాశ్వత స్ఫూర్తి. ఆమె పేరుతో ఏర్పడుతున్న ఈ విశ్వవిద్యాలయం అసోం విద్యా రంగానికి మైలురాయిగా నిలుస్తుంది. యువత సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధనలో భాగం అవుతుంది అని తెలిపారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో 10,000 మంది విద్యార్థులకు వసతి, విద్యా సదుపాయాలు కల్పించే విధంగా మౌలిక వసతులు అభివృద్ధి చేయనున్నారు. ఈశాన్య ప్రాంతంపై కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధతో విద్యా, ఆరోగ్య, క్రీడా రంగాల్లో వేగవంతమైన పురోగతి సాధ్యమైందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గోహ్‌పూర్‌లో స్థాపించబోతున్న స్వహీద్‌ కనకలత బరూ రాష్ట్ర విశ్వవిద్యాలయం, దేశభక్తి ప్రతీక అయిన కనకలత త్యాగానికి అంకితమవుతూ, అసోం యువతను భవిష్యత్‌ సాంకేతిక రంగాల్లో ముందుకు నడిపించనుంది. కేంద్రం ‘భారత భవిష్యత్‌ టెక్‌ శక్తి’గా ఈశాన్యాన్ని తీర్చిదిద్దేందుకు సంకల్పబద్ధంగా ఉన్నట్లు గోహ్‌పూర్‌ వేదిక మరోసారి స్పష్టం చేసింది. ఏఐ నుంచి క్వాంటం వరకు, సాంకేతికతకు గర్వకారణంగా నిలిచే ఈ విశ్వవిద్యాలయం దేశభక్తి, విద్యా అభివృద్ధి కలయికకు ప్రతీకగా నిలవనుంది.

గోహ్‌పూర్‌లో ఏఐ, డ్రోన్లతో కొత్త భవిష్యత్‌కు నాంది - Tholi Paluku