
గుర్మీత్ రామ్ రహీమ్కు పెరోల్
డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ సోమవారం రోహ్తక్లోని సునారియా జైలు నుంచి బయటకు వచ్చాడు. 2017లో ఇద్దరు మహిళా శిష్యులను అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న రామ్ రహీమ్కు ఈసారి 40 రోజుల పెరోల్ మంజూరైంది. అతడి శిక్ష కాలంలో ఇది 15వసారి పెరోల్ కావడం గమనార్హం. పెరోల్ కాలంలో రామ్ రహీమ్ హర్యానాలోని సిర్సా కేంద్రంగా ఉన్న డేరా సచ్చా సౌదా ఆశ్రమంలోనే నివసిస్తాడని డేరా ప్రతినిధి, న్యాయవాది జితేందర్ ఖురానా తెలిపారు. రామ్ రహీమ్తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు 16 సంవత్సరాల క్రితం ఒక జర్నలిస్టు హత్య కేసులోనూ 2019లో దోషులుగా తేలిన విషయం తెలిసిందే.
గతంలోనూ వరుసగా పెరోళ్లు, ఫర్లోలు
రామ్ రహీమ్ గతంలో అనేకసార్లు పెరోల్ లేదా ఫర్లో(మంచి ప్రవర్తన ఆధారంగా జైలు ఇచ్చే సెలవు)పై జైలు నుంచి బయటకు వచ్చాడు. ఆగస్టు 2025లో 40 రోజుల పెరోల్ పై విడుదలయ్యాడు. ఏప్రిల్ 2025లో 21 రోజులు మంజూరైంది. జనవరి 2025లో ఫిబ్రవరి 5న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 30 రోజుల పెరోల్ లభించింది. అక్టోబర్ 1 2024న, అక్టోబర్ 5న జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందే 20 రోజుల పెరోల్ పై బయటకు వచ్చాడు. ఆగస్టు 2024లో 21 రోజుల ఫర్లో ఇచ్చారు. ఫిబ్రవరి 7, 2022న, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం రెండు వారాల ముందే మూడు వారాల ఫర్లో మంజూరైంది. తరచు ఈ పెరోళ్లు, ఫర్లోలు రాజకీయంగా సున్నిత సమయాల్లో రావడంతో పెద్ద వివాదాలకు దారితీశాయి.
సిక్కు సంస్థల విమర్శలు
రామ్ రహీమ్కు పెరోల్ లేదా ఫర్లో మంజూరు చేయడాన్ని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) సహా పలు సిక్కు సంస్థలు గతంలో తీవ్రంగా విమర్శించాయి. తీవ్రమైన నేరాల్లో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి ఇంత తరచుగా ఉపశమనం ఇవ్వడం తగదని అవి అభిప్రాయపడ్డాయి.
2002 హత్య కేసులో హైకోర్టు తీర్పు
డేరా సచ్చా సౌదా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో రామ్ రహీమ్కు గత ఏడాది ఊరట లభించింది. మే 2024లో పంజాబ్–హర్యానా హైకోర్టు, విచారణలో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ, సీబీఐ ప్రత్యేక కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్షను రద్దు చేసింది. ఈ కేసులో సీబీఐ రామ్ రహీమ్తో పాటు మరో నలుగురిపై నేరపూరిత కుట్ర పన్నినట్లు ఆరోపించింది.
గతంలో యూపీలో నివాసం
రామ్ రహీమ్ గత 14 పర్యాయాల్లో పెరోల్ లేదా ఫర్లోపై బయటకు వచ్చినప్పుడు ఎక్కువసార్లు ఉత్తరప్రదేశ్లోని బాఘ్పత్ జిల్లాలో ఉన్న డేరా ఆశ్రమంలోనే గడిపాడు.
డేరాకు విస్తృత అనుచరగణం
సిర్సా కేంద్రంగా ఉన్న డేరా సచ్చా సౌదాకు హర్యానా, పంజాబ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో అనుచరులు ఉన్నారు. హర్యానాలోని సిర్సా, ఫతేహాబాద్, కురుక్షేత్ర, కైథల్, హిసార్ వంటి జిల్లాల్లో డేరాకు గణనీయమైన ప్రభావం ఉంది.
ఫర్లో, పెరోల్ మధ్య తేడా ఏమిటి?
జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఇచ్చే ఫర్లో, పెరోల్ అనే పదాలు తరచూ వార్తల్లో వినిపిస్తుంటాయి. అయితే ఈ రెండింటి మధ్య స్పష్టమైన చట్టపరమైన తేడాలు ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
ఫర్లో అనేది ఖైదీకి జైలు ఇచ్చే సెలవు. మంచి ప్రవర్తన, అర్హతలు ఉన్న ఖైదీలకు కుటుంబ సంబంధాలు కొనసాగించేందుకు, సమాజంతో అనుసంధానం కోసం ఫర్లో మంజూరు చేస్తారు. ఇది సాధారణంగా 14 నుంచి 21 రోజుల వరకు ఉంటుంది. ముఖ్యంగా, ఫర్లోపై బయట ఉన్న రోజులు కూడా ఖైదీ శిక్ష కాలంలో భాగంగా లెక్కలోకి వస్తాయి. అందువల్ల ఇది ఖైదీకి ఒక హక్కుగా భావిస్తారు.
ఇక పెరోల్ అనేది ఖైదీకి ఇచ్చే తాత్కాలిక విడుదల. అనారోగ్యం, కుటుంబంలో మరణం, ప్రత్యేక పరిస్థితులు వంటి కారణాలపై పెరోల్ మంజూరు చేస్తారు. ఇది పూర్తిగా ప్రభుత్వం లేదా సంబంధిత అధికారుల విచక్షణపై ఆధారపడి ఉంటుంది. పెరోల్ కాలం సాధారణంగా 20 నుంచి 40 రోజుల వరకు ఉంటుంది. పెరోల్ పై బయట ఉన్న రోజులు శిక్ష కాలంలో లెక్కలోకి రావు. న్యాయపరంగా చూస్తే, ఫర్లో ఒక నియమిత విధానంలో ఖైదీలకు ఇచ్చే ఉపశమనం కాగా, పెరోల్ అనేది అసాధారణ పరిస్థితుల్లో ఇచ్చే వెసులుబాటు అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో పెరోల్ మంజూరైతే రాజకీయ వివాదాలకు దారి తీసే అవకాశముంటుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
