
గురుకులం విద్యార్థినులకు ఆరోగ్య శాఖ మంత్రి పరామర్శ
అస్వస్థత, అనారోగ్యానికి గురై కేజీహెచ్లో చికిత్స పొందుతున్న కురుపాం గురుకుల పాఠశాల విద్యార్థినులను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పరామర్శించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్లతో కలిసి మంగళవారం మధ్యాహ్నం మంత్రి కేజీహెచ్కు వెళ్లారు. క్యాజువాలిటీలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని, భయపడవద్దని భరోసా ఇచ్చారు.
విద్యార్థినులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఈ సందర్భంగా వైద్యాధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు 53 మంది చికిత్స నిమిత్తం కేజీహెచ్కు రాగా మంగళవారం 13 మంది డిశ్చార్జి అయినట్లు మీడియాతో మాట్లాడుతూ మంత్రి వెల్లడించారు. పూర్తిస్థాయిలో నయమైన తర్వాత మిగిలిన వారిని ఒకటి, రెండు రోజుల్లో డిశ్చార్జి చేయిస్తామని చెప్పారు. కురుపాం ఘటనపై, అక్కడి పరిస్థితులపై విచారించేందుకు ఇప్పటికే అధికారుల బృందం వెళ్లిందని మంత్రి గుర్తు చేశారు. ఆ నివేదికల ఆధారంగా భవిష్యత్తు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆయన వెంట కేజీహెచ్ సూపరింటెండెంట్, సీఎస్ఆర్ఎంవో, అడ్మినిస్ట్రేటర్, ఇతర వైద్యాధికారులు ఉన్నారు.
