
గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులే ప్రాధాన్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించడంలో మానవీయ దృక్పథాన్ని అనుసరించాలని సూచించిన ఆయన, గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న మంత్రి, ప్రతి గిరిజన నివాసంలో రహదారులు, గృహాలు, విద్యుత్, తాగునీరు వంటి కనీస మౌలిక వసతులు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మౌలిక సదుపాయాలే సమగ్ర అభివృద్ధికి పునాది అని ఆయన తెలిపారు.
సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి మంత్రి గిరిజన ప్రాంతాల సమస్యలపై జిల్లా కలెక్టర్లు, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారులు, అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. నిధులు మంజూరైనప్పటికీ అమలులో జాప్యం జరుగుతున్న విషయంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొంటూ, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
గిరిజన సంక్షేమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్న మంత్రి, అభివృద్ధి పనులను కఠినంగా పర్యవేక్షించాలని, ఆలస్యం సహించబడదని హెచ్చరించారు. అటవీ భూములు, పోడు వ్యవసాయం, అటవీ హక్కుల చట్టం అమలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అటవీ, రెవెన్యూ శాఖలు కలిసి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, అవసరమైతే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. గిరిజన యువతకు కుల ధృవీకరణ పత్రాల జారీ సమస్యలపై కూడా మంత్రి స్పందించారు. ఈ అంశంపై అడ్వకేట్ జనరల్తో సంప్రదించి శాశ్వత పరిష్కారం కనుగొనాలని సూచించారు. సులభమైన, పారదర్శకమైన విధానం రూపొందించాలని చెప్పారు.
జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఐటీడీఏ అధికారులు, అటవీ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేసి స్థానికంగా సమస్యలను పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో ఇందిరమ్మ గృహాల నిర్మాణానికి ఇసుక సరఫరా అడ్డంకిగా ఉండకూడదని స్పష్టం చేశారు. అలాగే తాగునీటి సమస్యల పరిష్కారానికి కొత్త బోర్వెల్స్ తవ్వడం, ఇప్పటికే ఉన్న వనరులను పునరుద్ధరించడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు.
గిరిజన అభివృద్ధి కోసం ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన మంత్రి, స్వయంగా గిరిజన ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను పరిశీలిస్తానని తెలిపారు. నెలాఖరులోగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని గడువు విధించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పరిష్కారాలు ఉండాలని, ఒకే విధానం అన్ని ప్రాంతాలకు సరిపోదని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించగా, మంత్రి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశానికి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, ఐటీడీఏ అధికారులు హాజరయ్యారు.
