
గంభీర్కు ‘రాజస్థాన్ రాయల్స్’ బంపర్ ఆఫర్.. వాటాతో పాటు సీఈఓ పదవి!
ఐపీఎల్ 2026 సీజన్ ముంగిట టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కళ్లు చెదిరే ఆఫర్ ఇచ్చింది. జట్టులో కేవలం మెంటార్గానే కాకుండా, భాగస్వామిగా ఉంటూ ఏకంగా 2 నుంచి 3 శాతం వాటాను ఆఫర్ చేసినట్లు సమాచారం. దీంతో పాటు ఫ్రాంచైజీ సీఈఓ బాధ్యతలను కూడా చేపట్టాలని కోరినట్లు తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న నూతన ఇన్వెస్టర్లు సుమారు 1.3 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో రూ.11.786 కోట్లు) మేర బిడ్లు దాఖలు చేస్తున్న తరుణంలో, గంభీర్ వంటి బలమైన వ్యక్తిని జట్టులో చేర్చుకోవడం ద్వారా ఫ్రాంచైజీ విలువను మరింత పెంచవచ్చని వారు భావిస్తున్నారు.
అడ్డుగా బీసీసీఐ ఒప్పందం
రాజస్థాన్ రాయల్స్ ఆఫర్ అద్భుతంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం గంభీర్ భారత జట్టు హెడ్ కోచ్గా ఉండటం దీనికి ప్రధాన అడ్డంకిగా మారింది. లోధా కమిటీ సిఫార్సుల ప్రకారం ‘పరస్పర విరుద్ధ ప్రయోజనాల’ నిబంధనల దృష్ట్యా, ఒక వ్యక్తి ఒకే సమయంలో జాతీయ జట్టు కోచ్గా, ఐపీఎల్ జట్టు యజమానిగా లేదా అధికారిగా కొనసాగలేరు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు గంభీర్ బీసీసీఐతో ఒప్పందంలో ఉన్నారు. ఒకవేళ ఆయన రాజస్థాన్ రాయల్స్ ఆఫర్ను అంగీకరించాలంటే తన ప్రస్తుత కోచ్ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.
లక్ష్యం టీమిండియా విజయాలే..
ప్రస్తుతానికి గంభీర్ దృష్టి పూర్తిగా భారత జట్టును విజయపథంలో నడిపించడంపైనే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. 2026లో జరగనున్న టీ20 ప్రపంచకప్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనున్న భారత్ను మరోసారి విజేతగా నిలబెట్టడం, అలాగే 2028 ఒలింపిక్స్లో క్రికెట్ అరంగేట్రం చేయనున్న తరుణంలో దేశానికి పతకాన్ని అందించడమే ఆయన తక్షణ లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. అంగీకరించలేని నిబంధనలు ఉన్నప్పటికీ, గంభీర్కు ఉన్న డిమాండ్ను రాజస్థాన్ రాయల్స్ ఆఫర్ మరోసారి నిరూపించింది.
