
ఖరీఫ్ సీజన్లో 71 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు: మంత్రి ఉత్తమ్ కుమార్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణలో సరికొత్త రికార్డును సృష్టించింది. గతంలో ఉన్న గరిష్ట స్థాయి 70.2 లక్షల మెట్రిక్ టన్నుల రికార్డును అధిగమించి, ఈసారి ఏకంగా 70.82 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించినట్లు పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం వెల్లడించారు.
ఈ వరి కొనుగోలు ప్రక్రియ ద్వారా 13.97 లక్షల మంది రైతులు నేరుగా లబ్ధి పొందారని మంత్రి తెలిపారు. సేకరించిన వరిలో 32.45 ఎల్ఎమ్టీ మోటా రకం, 38.37 ఎల్ఎమ్టీ సన్నరకం వరి ఉన్నట్లు చెప్పారు. మొత్తం సేకరించిన వరిని ప్రాసెసింగ్ కోసం మిల్లులకు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.
కనీస మద్దతు ధర కింద సేకరించిన వరికి రూ.16,912 కోట్లకు పైగా ఉందని మంత్రి తెలిపారు. అందులో ఇప్పటికే రూ.16,602 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని, ఇది 98 శాతం చెల్లింపుల సాధనగా పేర్కొన్నారు. అదనంగా రైతులకు మద్దతుగా రూ.1,425 కోట్ల బోనస్ కూడా చెల్లించినట్లు వెల్లడించారు.
ఈ భారీ కొనుగోలు కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 8,448 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అధికార యంత్రాంగం రైతులను చేరుకుంటూ, కొనుగోలు ప్రక్రియ రైతులకు అనుకూలంగా కొనసాగుతుందని ఆయన భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల కష్టఫలితంగా రాష్ట్ర గోదాములు ధాన్యంతో నిండుతున్నాయని, సంక్రాంతి పండుగ కృతజ్ఞత, సమృద్ధికి ప్రతీకగా నిలుస్తుందన్నారు.
