
కోఠిలోని బ్యాంకు వీధిలో కాల్పుల కలకలం
శనివారం ఉదయం కోఠి ప్రాంతంలో జరిగిన ఘోర దోపిడీ, కాల్పుల ఘటన నగరాన్ని కలకలం చేసింది. కోజికోడ్కు చెందిన రిన్షాద్ పి.వి. (26), అనే వ్యక్తి రెడీమేడ్ పిల్లల దుస్తుల వ్యాపారి. ప్రస్తుతం నాంపల్లిలోని జనతా అపార్ట్మెంట్స్లో నివసిస్తున్నారు. జనవరి 7న హోల్సేల్ స్టాక్ కోసం రూ. 6 లక్షల నగదుతో హైదరాబాద్కు వచ్చారు. కొనుగోలు కుదరకపోవడంతో తన బంధువు మిష్బాన్ సలహా మేరకు ఆ నగదును బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని నిర్ణయించుకున్నారు.
జనవరి 31న ఉదయం సుమారు 7 గంటలకు, రిన్షాద్ తన స్నేహితుడు అమీర్ వాహనంపై కోఠి బ్యాంక్ వీధిలోని ఎస్బీఐ ప్రధాన శాఖ ఏటీయం వద్ద నగదు జమ చేస్తున్న సమయంలో, ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వెనుక నుండి వచ్చి, తుపాకీని కడుపు వద్ద పెట్టి బెదిరించారు. దుండగులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు, అందులో ఒకటి రిన్షాద్ కుడి కాలుకు తగిలి గాయమైంది.
ఈ ఘటనకు సంబంధించి సుల్తాన్బజార్ పోలీస్ స్టేషన్లో ఎఫ్.ఐ.ఆర్ నం. 28/2026గా కేసు నమోదు చేయబడింది. నిందితులపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 109 (హత్యాయత్నం), 309 (దోపిడీ) ఆయుధ చట్టం-1959 సెక్షన్ 27 కింద అభియోగాలు మోపబడ్డాయి.
దుండగులు నగదు సంచితోపాటు రిన్షాద్ వాహనాన్ని బలవంతంగా లాక్ చేసి, TS 08 HN 8582 రిజిస్ట్రేషన్ వాహనంలో పరారయ్యారు. పోలీసులు దర్యాప్తు ప్రకారం, నిందితులు చాదర్ఘాట్ సిగ్నల్, నింబోలిఅడ్డా, కాచిగూడ వైపుగా వెళ్లి అక్కడ వాహనాన్ని వదిలి దుస్తులు మార్చుకొని కాలినడకన పారిపోయారు.
హైదరాబాద్ నగర పోలీసులు ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించి, నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక క్రైమ్ బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలను సేకరించడం, పొరుగు పోలీస్ స్టేషన్లతో సమన్వయం చేయడం వంటి చర్యలు జరుగుతున్నాయి. పోలీసులు పౌరుల భద్రతను అత్యంత ప్రాధాన్యం ఇచ్చి, నిందితులను త్వరలోనే పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అన్ని వనరులను వినియోగిస్తున్నారు.
ఏవైనా అనుమానాస్పద సమాచారం లభిస్తే, వారు ‘డయల్ 100’ ద్వారా పోలీస్ అధికారులకు తెలియజేయవచ్చు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి అని తెలియచేసారు.
