Let's talk: editor@tmv.in
కేరళలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాలుగు రోజుల పర్యటన - స్టేడియంలో కుంగిన హెలికాప్టర్

కేరళలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాలుగు రోజుల పర్యటన - స్టేడియంలో కుంగిన హెలికాప్టర్

Dantu Vijaya Lakshmi Prasanna
23 అక్టోబర్, 2025

బుధవారం నాడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కేరళలోని ప్రమదం స్టేడియం హెలిప్యాడ్‌పై దిగిన తర్వాత, దాని టార్మాక్ (నేల)లో కొంత భాగం కుంగిపోయింది. వాతావరణం సరిగా లేకపోవడం వల్ల మొదట నిర్ణయించిన పంబా సమీపంలోని నిలక్కల్‌కు బదులుగా చివరి నిమిషంలో ప్రమదం స్టేడియాన్ని ల్యాండింగ్ ప్రదేశంగా మార్చారు. దీంతో హెలిప్యాడ్‌ను మంగళవారం రాత్రి హడావిడిగా ఏర్పాటు చేయగా, కాంక్రీటు పూర్తిగా గట్టిపడకపోవడంతో హెలికాప్టర్ బరువుకు నేల కుంగిపోయింది. అక్కడ ఉన్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి,హెలికాప్టర్ సురక్షితంగా బయటకు వచ్చేలా చేతులతో ఆ హెలికాప్టర్‌ను కుంగిన ప్రదేశం నుండి నెట్టారు.ఈ సంఘటన రాష్ట్రపతి నాలుగు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా జరిగింది.

ఈ సంఘటన సిబ్బంది నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది. ముఖ్యంగా, ఇది ఒక ఉన్నత స్థాయి అధ్యక్ష పర్యటనలో జరిగిన ప్రమాదకర పరిస్థితి కాబట్టి ఈ సంఘటన లాజిస్టికల్ లోపాన్ని ఎత్తి చూపిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రపతి సురక్షితంగా ఉన్నారు. హెలికాప్టర్ నుండి దిగిన వెంటనే రోడ్డు మార్గంలో శబరిమల దిగువన ఉన్న పంబాకు తన ప్రయాణాన్ని కొనసాగించారు. తరువాత రాష్ట్రపతి ముర్ము తిరువనంతపురం విమానాశ్రయానికి చేరుకున్నారు. కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, మరియు కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ ఆమెకు స్వాగతం పలికారు.

రాష్ట్రపతి నాలుగు రోజుల కేరళ పర్యటనలో బాగంగా ఆమె శబరిమల ఆలయానికి వెళ్లి అక్కడ దర్శనం, హారతిలో పాల్గొంటారు. అనంతరం తిరువనంతపురం రాజ్‌భవన్‌లో మాజీ రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. వర్కలలోని శివగిరి మఠంలో శ్రీ నారాయణ గురు మహాసమాధి శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. తరువాత పాలైలోని సెయింట్ థామస్ కాలేజీ ప్లాటినం జూబ్లీ ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే పర్యటనలో చివరిరోజు ఎర్నాకుళంలోని సెయింట్ థెరిసా కళాశాల శతాబ్ది ఉత్సవాలకు హాజరవుతారు. అనంతరం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ నేతృత్వంలోని ఒక ప్రతినిధి బృందం రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి ముర్మును కలిసి, శబరిమల బంగారు చోరీ సంఘటనతో సహా వివిధ సమస్యలపై ప్రజల ఆందోళనలను ఆమె దృష్టికి తీసుకురానున్నారు.