Let's talk: editor@tmv.in
కేరళలో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల

కేరళలో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల

Gaddamidi Naveen
21 మార్చి, 2026

కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సీట్ల కేటాయింపుపై పార్టీలో అంతర్గత చర్చలు, ఎంపీల డిమాండ్ల మధ్య కాంగ్రెస్ పార్టీ గురువారం తన రెండో జాబితాను విడుదల చేసింది. 37 మంది అభ్యర్థులతో కూడిన ఈ జాబితాలో ఒక్క లోక్‌సభ సభ్యునికి కూడా అవకాశం కల్పించకపోవడం గమనార్హం. గతంలో విడుదల చేసిన మొదటి జాబితాలో 55 మంది అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాలని పట్టుబట్టిన కన్నూర్ ఎంపీ కె. సుధాకరన్ వ్యవహారం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఏకే ఆంటోనీ వంటి సీనియర్ నేతల జోక్యంతో ఆయన వెనక్కి తగ్గారు. సుధాకరన్ పోటీ చేయాలనుకున్న కన్నూర్ స్థానం నుంచి పార్టీ టి.ఓ. మోహనన్‌ను బరిలోకి దించింది. అంబలప్పుళ, తలిపరంబ, పయ్యనూర్, ఒట్టపాలెం వంటి నియోజకవర్గాల్లో మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ ప్రాంతాల్లో సీపీఐ(ఎం) తిరుగుబాటు నేతలు బరిలో ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది.

మాజీ ఎమ్మెల్యే, తిరువనంతపురం కౌన్సిలర్ కె.ఎస్. శబరినాథన్ నేమం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆయన బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్, సీపీఎం నేత వి.ఎస్. శివన్ కుట్టిలతో హోరాహోరీగా తలపడనున్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సందీప్ వారియర్ కాసరగోడ్‌లోని త్రిక్కరిపూర్ నుంచి పోటీ చేయనున్నారు. యూత్ కాంగ్రెస్ నేత అబిన్ వర్కీ ఆరన్ముల నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పెరుంబవూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎల్దోస్ కున్నపిల్లికి ఈసారి టికెట్ నిరాకరించి, ఆయన స్థానంలో మనోజ్ మూతేదన్‌ను ఎంపిక చేశారు. త్రిపుణితురలో కె. బాబు స్వచ్ఛందంగా తప్పుకోవడంతో దీపక్ జోయ్‌కు అవకాశం దక్కింది.

కొట్టాయం డీసీసీ అధ్యక్షుడు నట్టాకం సురేష్‌కు ఎట్టుమనూర్ స్థానాన్ని కేటాయించారు. మాజీ మంత్రి వి.ఎస్. శివకుమార్‌ను అరువిక్కర నుంచి, సనల్ కుమార్‌ను పరస్సాల నుంచి నిలబెట్టారు. కొచ్చి మాజీ మేయర్ టోనీ చమ్మనీ వైపిన్ నుంచి పోటీ చేయనున్నారు. మొత్తం మీద కాంగ్రెస్, మద్దతు స్వతంత్రులు కలిపి 96 స్థానాల్లో పోటీ చేస్తుండగా, అందులో 8 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఏప్రిల్ 9న జరగనున్న ఎన్నికలకు మూడువారాల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో, పార్టీ అంతర్గత విభేదాలను త్వరలో పరిష్కరించి ప్రచారాన్ని వేగవంతం చేయాలని భావిస్తోంది.

"టీమ్ యూడీఎఫ్ అంటే టీమ్ కేరళం": రాహుల్ గాంధీ

కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న వేళ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ యూడీఎఫ్ కూటమికి తన పూర్తి మద్దతు ప్రకటించారు. "టీమ్ యూడీఎఫ్ అంటే టీమ్ కేరళంష అని ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో అభివర్ణిస్తూ, ఈ కూటమి ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమని ఆయన కొనియాడారు.

కేరళ ప్రజలతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఈ రాష్ట్రం తనకు ఇంటివంటిదని, ప్రజలు కుటుంబ సభ్యుల్లాంటివారని రాహుల్ గాంధీ అన్నారు. ప్రజలు ఇచ్చిన ప్రేమ, ఆదరణకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని, భవిష్యత్తులో కూడా వారికి తోడుగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, పారదర్శకంగా పనిచేసే, ప్రజల మాట వినే ప్రభుత్వాన్ని ఆశిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాబోయే యూడీఎఫ్ ప్రభుత్వం రాష్ట్రానికి మెరుగైన భవిష్యత్తు నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ తాము పోటీ చేస్తున్న మొత్తం 95 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ వెల్లడించారు. ఎంపిక ప్రక్రియ ముగిసిందని, ఇక పూర్తిస్థాయి ప్రచారంలోకి వెళ్తున్నామని ఆయన చెప్పారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం, కేరళలో ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

కేరళలో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల - Tholi Paluku