
కేరళను ఫాలో అవ్వండి : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలాన్లు జారీ చేయడానికి ముందు, కేరళలో అమలు చేస్తున్న విధానం మాదిరిగానే, ప్రజల మొబైల్ ఫోన్లకు హెచ్చరిక సందేశాలు పంపాలని అధికారులను ఆదేశించారు.
"మొదటగా, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రజల మొబైల్స్కు అధికారులు హెచ్చరికలు, వార్నింగ్లు పంపాలి, ఆ తరువాత పదేపదే ఉల్లంఘనలకు పాల్పడితేనే చలాన్లు జారీ చేయాలి," అని చంద్రబాబు నాయుడు అధికారిక పత్రికా ప్రకటనలో తెలిపారు. "చలాన్లతో ప్రజలను భయపెట్టడం సరికాదు," అని ఆయన అన్నారు.
పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, తొక్కిసలాటలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో, ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ వాడకంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరాన్ని చెప్పారు.
ముఖ్యంగా భారీ జనసమూహాల సమయంలో తొక్కిసలాటలను నివారించడానికి, ముందస్తు ప్రణాళిక ప్రమాదకర ప్రాంతాలలో ముందుగానే హెచ్చరికలు ఉండేలా చూసుకోవాలని, తద్వారా జనసమూహాల నిర్వహణ పై దృష్టి పెట్టాలని నాయుడు అధికారులను ఆదేశించారు. అలాగే, గుంతలు లేని రోడ్లను నిర్వహించడానికి తక్షణమే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, భారీ వర్షాల సమయంలో నీరు నిలబడకుండా సరైన డ్రైనేజీ నిర్వహణను చేపట్టాలని ఆయన నిర్దేశించారు.
ముఖ్యమంత్రి యువతకు ఉపాధి అవకాశాలను పెంచడానికి, రాష్ట్రంలోని శ్రామిక శక్తిని, పారిశ్రామిక వృద్ధిని బలోపేతం చేయడానికి జిల్లాలవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యోగ మేళాలు నిర్వహించాలని కూడా పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా రిజిస్ట్రార్ కార్యాలయాల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తూ, "అవినీతిని నిర్మూలించాలని" అధికారులను ఆదేశించారు. పనితీరును మెరుగుపరచడానికి రెండున్నర నెలల గడువు విధించారు.
