
కేరళం ఎన్నికల్లో వృద్ధులే కీలకం
కేరళంలో ఏప్రిల్ 9న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వయోజన ఓటర్లు భద్రత, గౌరవంతో జీవించే హామీలను ప్రధానంగా కోరుతున్నారు. మేనిఫెస్టోలు, రాజకీయ పోటీల కంటే నెలవారీ పెన్షన్, వైద్య సేవలు, సంరక్షణ వంటి అంశాలే తమకు ముఖ్యమని పలువురు వృద్ధులు చెబుతున్నారు.
ముఖ్యంగా రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలోనే కేరళ జనాభాలో అత్యధికంగా సుమారు 16.5 శాతం మంది వృద్ధులే ఉండటం గమనార్హం. దీంతో ఈ వర్గం ఎన్నికల్లో కీలక ఓటు బ్యాంక్గా మారింది. వృద్ధులు ముఖ్యంగా నెలవారీ పెన్షన్ సమయానికి అందడం, ఇంటి వద్దే వైద్య సేవలు అందుబాటులో ఉండటం, ఒంటరితనాన్ని తగ్గించే సామాజిక కార్యక్రమాలు, భద్రతా ఏర్పాట్లు వంటి అంశాలను కోరుతున్నారు. విదేశాల్లో పనిచేస్తున్న పిల్లల కారణంగా చాలా మంది వృద్ధులు ఇంట్లో ఒంటరిగా ఉండాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. అత్యవసర సమయంలో వైద్య సహాయం ఎలా పొందాలన్న ఆందోళన కూడా వారికి ఉంది.
విథుర ప్రాంతానికి చెందిన 81 ఏళ్ల కృష్ణమ్మ ఇంటికి ఓటు అడగడానికి వచ్చిన పార్టీ కార్యకర్తలను చూసి నాకు వచ్చే పెన్షన్ ఎప్పుడు వస్తుంది? అని ప్రశ్నించారు. ఆమె లాంటి వేలాది మంది వృద్ధులకు ఈ ఎన్నికలు రాజకీయ పోటీ కంటే జీవన భద్రతకు సంబంధించినవిగా మారాయి.
పోటాపోటీగా వృద్ధులకు హామీలు
ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ కూటములు వృద్ధులను ఆకర్షించే హామీలు ఇస్తున్నాయి. అధికార కూటమి అయిన ఎల్డీఎఫ్ పెన్షన్ను రూ.3,000కు పెంచుతామని ప్రకటించింది. అలాగే వృద్ధాశ్రమాలు, పల్లియేటివ్ కేర్ కేంద్రాలను బలోపేతం చేస్తామని తెలిపింది. ఇదే సమయంలో ప్రతిపక్ష కూటమి యూడీఎఫ్ పెన్షన్ను సమయానికి చెల్లించే విధానాన్ని అమలు చేస్తామని, వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు ఎన్డీయే వృద్ధులకు ఉచిత వైద్య సేవలు అందించే విధంగా కేంద్ర పథకాలను సమర్థంగా అమలు చేస్తామని తెలిపింది. రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే కీలక వర్గంగా మారారు. తమకు ముఖ్యమైనది రాజకీయ హామీలు కాకుండా సమయానికి పెన్షన్, వైద్య భద్రత, గౌరవప్రదమైన జీవితం అని వృద్ధులు చెబుతున్నారు.
