
కేంద్ర పౌర విమానయాన మంత్రి రాజీనామా చేయాలి: రోహిత్ పవార్
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు విమాన ప్రమాదంలో మృతిచెందిన అజిత్ పవార్ మరణం నేపథ్యంలో ప్రశ్నలు లేవనెత్తుతున్న ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్ కు రాష్ట్ర ప్రభుత్వం తగిన భద్రత కల్పించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే డిమాండ్ చేశారు. రోహిత్ పవార్ ప్రజల భావాలను ప్రతిబింబిస్తూ, వాస్తవాలు, ప్రశ్నలను పరిశోధనాత్మకంగా ముందుకు తెస్తున్నారని ఆమె చెప్పారు. అధికారుల నుంచి స్పష్టమైన సమాధానాలు రావాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రతి భారత పౌరుడికి వ్యవస్థను ప్రశ్నించే హక్కు రాజ్యాంగం కల్పించిందని సూలే అన్నారు. ప్రజల మనసుల్లో ఉన్న సందేహాలను రోహిత్ పవార్ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారని చెప్పారు. అతనికి తగిన భద్రత కల్పించడం అత్యంత అవసరమని, అతని భద్రతకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల రెండు ప్రెస్ కాన్ఫరెన్సులు నిర్వహించిన రోహిత్ పవార్, ఈ విమాన ప్రమాదంలో ధ్వంసక చర్య (సబోటాజ్) ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు కేంద్ర పౌర విమానయాన మంత్రి కే. రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు.
అజిత్ దాదా మరణంతో పార్థ్, జయ్ తీవ్ర విషాదంలో ఉన్నారు: సుప్రియా సూలే
అజిత్ దాదా మరణంపై ఆయన కుమారులిద్దరి భావోద్వేగాలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ–శరద్ చంద్ర పవార్ (ఎన్సీపీ–ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే గురువారం మాట్లాడుతూ, విమాన ప్రమాదంలో మృతిచెందిన అజిత్ పవార్ మరణంపై ఆయన కుమారులు పార్థ్ పవార్, జయ్ పవార్ తీవ్ర విషాదంలో ఉన్నారని తెలిపారు. అజిత్ దాదా ఇలా ప్రాణాలు కోల్పోయిన తీరు పార్థ్, జయ్లను తీవ్రంగా కలచివేసింది. విమానం ఎలా కూలిపోయిందో ఇప్పటికీ ఎవరూ నమ్మలేకపోతున్నారు. జయ్ కూడా నిన్న తన భావాలను వ్యక్తం చేశాడని సూలే మీడియాతో అన్నారు. ఇదిలా ఉండగా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు మెమొరాండం సమర్పిస్తూ ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్, ఎన్సీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రపుల్ పటేల్, రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ టట్కారే , వైద్య విద్యాశాఖ మంత్రి హసన్ ముష్రిఫ్ తదితరులు ఈ మెమొరాండాన్ని సమర్పించారు. ఎన్సీపీ (ఎస్సీపీ), శివసేన(యూబీటీ), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ దురుద్దేశపూరిత చర్య ఉండొచ్చని సూచించాయి.
ఈ నేపథ్యంలో సుప్రియా సూలే మాట్లాడుతూ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ ఘటనపై స్పష్టత ఇవ్వాలని ఆశిస్తున్నామని చెప్పారు. ప్రజల మనసుల్లో అనేక ప్రశ్నలు ఉన్నాయి. వాటికి సమాధానాలు రావాలని ఆమె అన్నారు. అదేవిధంగా, రోహిత్ పవార్ దర్యాప్తు మందగమనంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికే 20 రోజులు గడిచినా దర్యాప్తు వేగం పెరగలేదు. ఇది ప్రైవేట్ కంపెనీకి ఆధారాలను నాశనం చేసుకునే సమయం ఇవ్వడానికేనా? బ్లాక్ బాక్స్ దెబ్బతిన్నదన్న సమాచారం వెలువడటంతో అనుమానాలు మరింత పెరిగాయి. ఇది ప్రమాదమా? హత్యా? అన్న ప్రశ్నకు సమాధానం దొరికే వరకు మేము ఆగం అని ఆయన పేర్కొన్నారు. అజిత్ పవార్ జనవరి 28 ఉదయం పుణే జిల్లా బరామతి విమానాశ్రయంలో ల్యాండింగ్కు ప్రయత్నిస్తున్న సమయంలో విమానం కూలిపోవడంతో ఆయనతో పాటు మరో నలుగురు మరణించారు.
