
కెనడాతో వాణిజ్య చర్చలు రద్దు: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాతో జరుగుతున్న అన్ని వాణిజ్య చర్చలను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఒంటారియో ప్రావిన్స్ ప్రభుత్వం అమెరికా సుంకాలను విమర్శిస్తూ ప్రసారం చేసిన 75 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.625 కోట్లు) టీవీ ప్రకటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కెనడా చర్యను ట్రంప్ "అత్యంత దారుణమైన చర్య"గా అభివర్ణించారు.
ఒంటారియో ప్రభుత్వం తన ఆటో, తయారీ రంగాలను ప్రతిపాదిత 25 శాతం అమెరికా సుంకాల నుండి రక్షించుకోవడానికి ఈ ప్రకటనను రూపొందించింది. ఈ యాడ్ అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ 1987 నాటి రేడియో ప్రసంగంలోని అసలు ఆడియోను ఉపయోగించింది. సుంకాలు వ్యాపారాలు, వినియోగదారులను దెబ్బతీస్తాయని, ఆర్థిక వృద్ధిని అడ్డుకుంటాయని రీగన్ ఆ ప్రసంగంలో హెచ్చరించారు. తద్వారా రిపబ్లికన్ దిగ్గజమైన రీగన్ కూడా ట్రంప్ వాణిజ్య విధానాలను వ్యతిరేకిస్తారనే పరోక్ష సందేశాన్ని కెనడా అమెరికన్ ఓటర్లు, విధాన నిర్ణేతలకు చేరవేయడానికి ప్రయత్నించింది. ఈ ప్రకటన అక్టోబర్ 14, 21 తేదీలలో అమెరికా బేస్ బాల్ ప్లేఆఫ్ల సమయంలో ప్రసారమై, అమెరికన్ ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
తన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ అయిన 'ట్రూత్ సోషల్'లో ట్రంప్ ఈ ప్రకటనపై విరుచుకుపడ్డారు. కెనడా ఈ యాడ్లో రీగన్ అభిప్రాయాలను వక్రీకరించిందని, అమెరికా సుప్రీంకోర్టు కేసుల నిర్ణయాలపై ప్రభావితం చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. "ప్రచార ప్రకటనలతో అమెరికన్ కోర్టులు, ప్రజాభిప్రాయంపై ఒత్తిడి చేయాలని కెనడా భావించడం పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. అమెరికాను గౌరవించడం నేర్చుకునే వరకు కెనడాతో అన్ని వాణిజ్య చర్చలను నేను నిలిపివేస్తున్నాను” అని ప్రకటించారు. రీగన్ ఫౌండేషన్ కూడా అనుమతి లేకుండా ప్రసంగాన్ని ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
కెనడా చేసిన ఈ 75 మిలియన్ డాలర్ల వ్యయం సుంకాలపై అమెరికా ప్రజల అభిప్రాయాన్ని మార్చడానికి కాంగ్రెస్, ట్రంప్ పరిపాలనపై రాజకీయ, ఆర్థిక వ్యయాన్ని తెలియజేయడానికి చేసిన పెట్టుబడిగా పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు, ట్రంప్ ఈ వివాదాన్ని వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటున్నారని, కెనడా ప్రకటనను "జాతీయ ప్రయోజనాలపై జోక్యం"గా చిత్రీకరించడం ద్వారా భవిష్యత్తు చర్చల్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ తన అభిమాన నాయకుడైన రీగన్ సుంకాలను వ్యతిరేకించినప్పటికీ, ట్రంప్ మాత్రం "అమెరికా ఫస్ట్" విధానంలో భాగంగా వాణిజ్యంలో కఠినంగా వ్యవహరించడాన్ని నొక్కి చెబుతున్నారు.
ఈ వివాదంపై ఒంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ స్పందిస్తూ, ప్రజా ప్రాముఖ్యత ఉన్న రీగన్ ప్రసంగంలోని కొంత భాగాన్ని మాత్రమే ఉపయోగించామని సమర్థించుకున్నారు. ఇక కెనడా ప్రధాని మార్క్ కార్నీ అమెరికా వాణిజ్య విధానాల అనిశ్చితిని తగ్గించుకోవడానికి అమెరికాయేతర మార్కెట్లకు ఎగుమతులను విస్తరించాలని యోచిస్తున్నట్లు సూచించారు.
కెనడా నుంచి దిగుమతి చేసుకునే అనేక వస్తువులపై ట్రంప్ ప్రభుత్వం 35 శాతం టారిఫ్లు విధించిన సంగతి తెలిసిందే. రంగాలవారీగా సుంకాలను ప్రకటించినప్పటికీ, అమెరికా-మెక్సికో-కెనడా ఒప్పందం పరిధిలోకి వచ్చే వస్తువులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఈ టారిఫ్ల ప్రకటన వెలువడినప్పటి నుండి అమెరికా, కెనడాల మధ్య మాటల యుద్ధం నడిచింది. దీంతో ఇరు దేశాల సంబంధాలు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. ఈ ఉద్రిక్తత నేపథ్యంలో, కొద్ది రోజుల క్రితం కెనడా ప్రధాని మార్క్ కార్నీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమయ్యారు. అయితే ఆ చర్చల వల్ల ఎలాంటి ఫలితం లేదని తాజాగా వెల్లడైంది.
కెనడాను 51వ రాష్ట్రంగా చేర్చుకోవాలని అమెరికా అధ్యక్ష ఎన్నికల నాటి నుంచే ట్రంప్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిని కెనడా ప్రభుత్వం గట్టిగా ఖండిస్తూ వస్తోంది, "మా దేశం అమ్మకానికి లేదు" అని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ పొరుగు దేశంపై సుంకాలతో విరుచుకుపడగా, ప్రతిగా కెనడా కూడా అమెరికా వస్తువులపై టారిఫ్లు విధించింది.
