
కాంగ్రెస్ హామీల మోసలపై జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ విస్తృత ప్రచారం
తెలంగాణ రాష్ట్ర యువతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించిందని తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ నెరవేర్చలేదని వారు ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా మహిళా మోర్చా రాష్ట్రాధ్యక్షురాలు డాక్టర్ శిల్పా రేణుక మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మహిళలను, యువతులను మోసం చేసింది. ఉపాధి, భద్రత, ఆర్థిక స్వావలంబన వంటి అంశాల్లో ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఎన్నికల ముందు ఇచ్చిన మహిళా నిధి, మహాలక్ష్మీ , యువ వికాసం, చేయుత,18 సంవత్సరాలు నిండిన యువతులకు ఎలక్ట్రక్ స్కూటర్లు అందజేత,‘స్వయం ఉపాధి పథకాలు’ అన్నీ మాటలకే పరిమితమయ్యాయని విమర్శించారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఓట్లు అడగడానికి కాంగ్రెస్ నేతలు ప్రజల మధ్యకు వస్తున్నారని ఆమె పేర్కొంటూ, హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు ఓట్లు అడగడం ప్రజలకు చేసిన మోసం. ఈసారి మహిళలు మోసపోవడం జరగదు.కాంగ్రెస్ నేతలను నిలదీయండి, ప్రశ్నించండి. వారిని బద్ధకంగా తిరిగి పంపించండి అని పిలుపునిచ్చారు.
ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా మహిళల అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు అవుతున్నాయని, తెలంగాణలో కూడా ఆ మార్పు రావాల్సిన సమయం వచ్చిందని ఆమె తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని విజయం వైపు నడిపించడం ద్వారా మహిళలు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని ఆమె అన్నారు.
