Let's talk: editor@tmv.in
కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి: రామచందర్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి: రామచందర్ రావు

Gaddamidi Naveen
28 జనవరి, 2026

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగుల ఆగ్రహం ఉప్పొంగుతోందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. కాంగ్రెస్ రోజులు లెక్కపెట్టబడుతున్నాయని, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులే కాంగ్రెస్‌కు తెలంగాణలో సమాధి కడతారని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.

మంగ‌ళ‌వారం హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన మహాధర్నాలో పాల్గొని ప్రసంగించిన రామచందర్ రావు, రిటైర్డ్ ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోందని తీవ్రంగా విమర్శించారు. జీవితాంతం ప్రజాసేవకు అంకితమైన ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీకి ప్రజలను మోసం చేసే దీర్ఘ చరిత్ర ఉందని రామచందర్ రావు అన్నారు. ‘గరీబీ హటావో’ వంటి నినాదాల నుంచి నిరుద్యోగ భృతి హామీలు, నకిలీ గ్యారంటీ కార్డులు, అమలు కాని సంక్షేమ పథకాల వరకు కాంగ్రెస్ హామీలన్నీ మాయమాటలేనని విమర్శించారు. ఎన్నికల సమయంలో భారీ హామీలతో ప్రజల ముందుకు వచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా మరిచిపోవడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందన్నారు. అదే మోసపూరిత రాజకీయ చక్రం ఇప్పుడు తెలంగాణలోనూ కొనసాగుతోందని చెప్పారు.

పునరావృత హామీలిచ్చినా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదలలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రామచందర్ రావు ఆరోపించారు. అలాగే పీఆర్సీ (పే రివిజన్ కమిషన్) అమలులోనూ తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. తమ హక్కుల కోసం రిటైర్డ్ ఉద్యోగులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఐదు డియర్నెస్ అలవెన్సులు (డీఏలు) ఇప్పటికీ చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచిన ఏకైక రాష్ట్రంగా మారిందని ఆయన తెలిపారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్థిక అవ్యవస్థకు, ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయ‌న‌ విమర్శించారు.

పదవీ విరమణ అనంతరం ప్రశాంతంగా జీవించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులను తమ హక్కుల కోసం రోడ్డెక్కేలా చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని రామచందర్ రావు విమర్శించారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఉద్యోగుల కష్టాలు మాత్రం మారలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్లు, డీఏ బకాయిల గురించి అడిగితే ‘డబ్బులు లేవు’ అంటూ చేతులెత్తేయడం ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని రామచందర్ రావు అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా దాదాపు 40 మంది రిటైర్డ్ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినంత బాధ కూడా లేదని తీవ్రంగా ఆయ‌న‌ విమర్శించారు.

జీవితాంతం ప్రజాసేవ చేసిన ఉద్యోగులను ఇలాంటి పరిస్థితుల్లోకి నెట్టడం అమానుషమని పేర్కొన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన అన్ని బకాయిలను ఎలాంటి ఆలస్యం లేకుండా తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని ఆయ‌న తెలిపారు.

ఈ అన్యాయాన్ని బీజేపీ సహించదని, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఈ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పకుండా బాధ్యత వహింపజేస్తారని రామచందర్ రావు హెచ్చరించారు. నేడు రోడ్లపై కనిపిస్తున్న ఆగ్రహమే కాంగ్రెస్‌కు చివరి హెచ్చరిక అని, తెలంగాణలో కాంగ్రెస్ పతనానికి కౌంట్‌డౌన్ మొదలైందని ఆయన పేర్కొన్నారు.