Let's talk: editor@tmv.in
కాంగ్రెస్ చొరబాటుదారుల పక్షం, బీజేపీ అభివృద్ధి పక్షం - నితిన్ నబిన్

కాంగ్రెస్ చొరబాటుదారుల పక్షం, బీజేపీ అభివృద్ధి పక్షం - నితిన్ నబిన్

Dantu Vijaya Lakshmi Prasanna
4 ఏప్రిల్, 2026

అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నేత నితిన్ నబిన్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులకు మద్దతు ఇచ్చిందని నితిన్ నబిన్ ఆరోపించారు. రాష్ట్రంలోని భూములను చొరబాటుదారులకు అప్పగించారని,వారి హయాంలో మహిళలకు, భూములకు రక్షణ లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. ఓటు వేసేటప్పుడు ప్రజలు పాత రోజులను గుర్తుంచుకోవాలని కోరారు.

కమల్‌పూర్, మంగళ్‌దాయి, న్యూ గువహటి నియోజకవర్గాల్లో జరిగిన ర్యాలీల్లో ఆయన ప్రసంగిస్తూ, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత పదేళ్లు అస్సాంలో అభివృద్ధికి చిరునామాగా నిలిచాయని పేర్కొన్నారు.

బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చొరబాటుదారులను గుర్తించి, ఓటర్ల జాబితా నుండి వారి పేర్లను తొలగించిందని నబిన్ తెలిపారు. త్వరలోనే వారిని రాష్ట్రం నుండి బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడితే, బీజేపీ స్వదేశీ ప్రజల పక్షాన నిలుస్తుందని చెప్పారు.

2009-10 కాలం నుండి తాను అస్సాంను సందర్శిస్తున్నానని, అప్పట్లో ఎక్కడ చూసినా హింస, ఆందోళనల గురించే చర్చ జరిగేదని ఆయన గుర్తు చేశారు. ప్రయాణాలు చేయాలన్నా భయం వేసేదని, అభివృద్ధి అనే మాటే వినిపించేది కాదని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఆయన అన్నారు. బీజేపీ హయాంలో యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభించాయని నబిన్ పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ టీ తోటల కార్మికులను పట్టించుకోలేదని, కానీ తమ ప్రభుత్వం వారికి భూమి పట్టాలు ఇచ్చిందని తెలిపారు. అలాగే టీ తోటల కార్మికుల దినసరి వేతనాన్ని రూ. 500కు పెంచుతామని హామీ ఇచ్చారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈశాన్య ప్రాంతాన్ని క్రమం తప్పకుండా సందర్శించలేదని, అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రాంతంలోని దాదాపు అన్ని జిల్లాలను సందర్శించారని ఆయన కొనియాడారు. చొరబాటుదారుల నుండి 1.25 లక్షల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని గిరిజనులకు హక్కులు కల్పించామన్నారు.

రాహుల్ గాంధీని 'పార్ట్ టైమ్ పొలిటీషియన్'గా నబిన్ అభివర్ణించారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో అస్సాం సంప్రదాయ వస్త్రమైన 'గామోచా'ను ధరించడానికి నిరాకరించి అస్సాం ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఆయన కనిపిస్తారని, ఆ తర్వాత విదేశాలకు వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు.

చైనా సరిహద్దుల్లో రహదారులు నిర్మిస్తే శత్రు సైన్యం లోపలికి వస్తుందనే భయంతో కాంగ్రెస్ అభివృద్ధిని అడ్డుకుందని నబిన్ విమర్శించారు. కానీ మోడీ ప్రభుత్వం సరిహద్దుల్లో ప్రపంచ స్థాయి రోడ్లను నిర్మించిందని, దీనివల్ల మారుమూల ప్రాంతాల్లో కూడా శ్రేయస్సు పెరిగిందని ఆయన స్పష్టం చేశారు. కాగా 126 స్థానాలు ఉన్న అస్సాం అసెంబ్లీకి ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుండగా, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.

కాంగ్రెస్ చొరబాటుదారుల పక్షం, బీజేపీ అభివృద్ధి పక్షం - నితిన్ నబిన్ - Tholi Paluku