
కాంగ్రెస్పై పార్థ్ వ్యాఖ్యలు సరికాదు: రోహిత్ పవార్
మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ‘పతనం’పై ఎన్సీపీ నేత పార్థ్ పవార్ చేసిన వ్యాఖ్యలు తగవని ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్ అభిప్రాయపడ్డారు. బారామతి ఉప ఎన్నికను ఏకగ్రీవంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల మధ్య సంభాషణ అవసరమని ఆయన సూచించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధ్యక్షురాలు సునేత్రా పవార్ ఏప్రిల్ 23న జరిగే బారామతి అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నారు. ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన ఆమె భర్త అజిత్ పవార్ ఈ ఏడాది జనవరిలో విమాన ప్రమాదంలో మరణించారు. ఆయనకు గౌరవ సూచకంగా ఉప ఎన్నికను ఏకగ్రీవంగా నిర్వహించాలని అధికార మహాయుతి కూటమి కోరింది. ప్రతిపక్ష మహా వికాస్ ఆఘాడి కూటమిలో భాగమైన ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యూబీటీ) పార్టీలు అభ్యర్థులను నిలబెట్టలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆకాశ్మోరేను అభ్యర్థిగా ప్రకటించి పోటీకి దిగింది. దీనిపై స్పందించిన పార్థ్ పవార్, తన తల్లిపై అభ్యర్థిని నిలబెట్టినందుకు కాంగ్రెస్ నష్టపోతుందని, మహారాష్ట్రలో ఆ పార్టీ పతనం అవుతోందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్పవార్ కూడా విమర్శలు చేశారు.
ఆకాశ్ మోరే షరతులతో నామినేషన్ వేశారు
ఈ నేపథ్యంలో రోహిత్ పవార్ మాట్లాడుతూ, బారామతి ఉప ఎన్నికను ఏకగ్రీవంగా నిర్వహించాలని ముందుగా ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సులే కోరారని తెలిపారు. ఆ పిలుపును అనేక పార్టీలు గౌరవించాయని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆకాశ్ మోరే షరతులతో కూడిన నామినేషన్ దాఖలు చేశారని, జనవరి 28న జరిగిన బారామతి విమాన ప్రమాదంపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే తాను పోటీ నుంచి తప్పుకుంటానని సూచించినట్లు చెప్పారు. ప్రభుత్వంలో ఉన్నవారికి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సులభమే. కానీ అది జరగడం లేదు. అజిత్ దాదాకు న్యాయం జరగాలనే కాంగ్రెస్ వైఖరి కనిపిస్తోంది. ఎఫ్ఐఆర్ నమోదు అయితే వారు పోటీ నుంచి తప్పుకునే అవకాశముందని రోహిత్ పవార్ అన్నారు. ఏ సమస్యకైనా పరిష్కారం సంభాషణ ద్వారానే సాధ్యమని ఆయన అన్నారు. మాట్లాడే ముందు ఆలోచించాలి. కాంగ్రెస్ పతనం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నాయకులు వినయంగా ఉండాలని ఆయన సూచించారు. ఏ రాజకీయ పార్టీ కూడా ఒక్కసారిగా అంతరించిపోదని, ప్రతి పార్టీ తన బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుందని చెప్పారు.
