
కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన స్మృతి మంధాన
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అంతర్జాతీయ వన్డేల్లో అరుదైన రికార్డు సృష్టించారు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కేవలం 50 బంతుల్లోనే సెంచరీ చేసి చరిత్ర లిఖించారు. ఈ మెరుపు శతకంతో ఆమె మహిళల అంతర్జాతీయ వన్డేల్లో రెండో వేగవంతమైన సెంచరీ సాధించిన క్రికెటర్గా నిలిచారు. అంతేకాదు పురుషులు, మహిళల క్రికెట్లో వన్డేల్లో వేగవంతమైన సెంచరీ సాధించిన భారతీయ క్రికెటర్గా విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టారు.
రికార్డు ఇన్నింగ్స్
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే జరిగింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు మొదట బ్యాటింగ్ చేసి, 412 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు తరపున ఓపెనర్గా బరిలోకి దిగిన స్మృతి మంధాన విధ్వంసం సృష్టించారు. ఆమె కేవలం 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి, భారత మహిళల జట్టు తరఫున వేగవంతమైన అర్ధ సెంచరీ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత కూడా అదే దూకుడుతో ఆడిన మంధాన, ఫోర్లు, సిక్సర్లతో ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించారు. 18వ ఓవర్లో అలనా కింగ్ బౌలింగ్లో డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్స్ కొట్టి, తన శతకాన్ని పూర్తి చేశారు. ఈ ఇన్నింగ్స్లో ఆమె 14 ఫోర్లు, 4 సిక్సర్లు బాదారు.
విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు
2013లో విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాపై 52 బంతుల్లో సెంచరీ చేసి భారత్ తరఫున వేగవంతమైన వన్డే సెంచరీ రికార్డును నెలకొల్పారు. సుమారు 12 సంవత్సరాల తర్వాత స్మృతి మంధాన ఆ రికార్డును బద్దలు కొట్టారు. కేవలం 50 బంతుల్లోనే సెంచరీ చేసి, ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నారు. పురుషులు, మహిళల క్రికెట్ చరిత్రలో ఈ రికార్డు నెలకొల్పిన తొలి భారతీయ క్రికెటర్గా ఆమె నిలిచారు.
అంతర్జాతీయ రికార్డులు
మహిళల అంతర్జాతీయ వన్డేల్లో వేగవంతమైన సెంచరీల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్ 45 బంతుల్లో సెంచరీ చేసి మొదటి స్థానంలో ఉన్నారు. స్మృతి మంధాన 50 బంతుల సెంచరీతో ఆ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. అంతకు ముందు ఇదే మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాటర్ బెత్ మూనీ 57 బంతుల్లో సెంచరీ చేసి, కరెన్ రోల్టన్ రికార్డును సమం చేశారు. కానీ కొద్ది గంటల వ్యవధిలోనే స్మృతి మంధాన వారిద్దరినీ అధిగమించి, రెండో స్థానానికి చేరుకున్నారు.
ఈ సెంచరీ మంధాన కెరీర్లో 13వది. దీంతో ఆమె అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో న్యూజిలాండ్ ప్లేయర్ సూజీ బేట్స్తో కలిసి రెండో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో మెగ్ లానింగ్ 15 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నారు. ఈ ఏడాదిలో ఇది మంధానకు నాలుగో సెంచరీ కావడం విశేషం.
స్మృతి మంధాన ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత జట్టు 43 పరుగుల తేడాతో ఓడిపోయింది. మంధాన మెరుపు ఇన్నింగ్స్ జట్టును విజయానికి దగ్గరగా తీసుకొచ్చినప్పటికీ, చివరికి ఓటమి తప్పలేదు. అయినప్పటికీ ఆమె రికార్డుల పరంపర మాత్రం భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది.
