Let's talk: editor@tmv.in
కరూర్ తొక్కిసలాట: రంగంలోకి దిగిన సీబీఐ

కరూర్ తొక్కిసలాట: రంగంలోకి దిగిన సీబీఐ

Bavana Guntha
18 అక్టోబర్, 2025

తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్ ర్యాలీలో సెప్టెంబర్ 27న జరిగిన ఘోరమైన తొక్కిసలాట కేసు దర్యాప్తు కోసం సీబీఐ ప్రత్యేక బృందం కరూర్‌కు చేరుకుంది. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ఈ సీబీఐ బృందం ఏర్పడింది. ఇందులో అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ముఖేష్ కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రామకృష్ణన్ ఉన్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర దర్యాప్తు

ఈ విషాద ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే సీబీఐ రంగంలోకి దిగింది. రాష్ట్ర దర్యాప్తు బృందం వద్ద ఉన్న కేసులకు సంబంధించిన అన్ని పత్రాలను సీబీఐకి అప్పగించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

దర్యాప్తు పర్యవేక్షణకు కమిటీ

దర్యాప్తు స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా జరిగేలా పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. జస్టిస్ రస్తోగి ఈ కమిటీకి సహాయం చేయడానికి ఇద్దరు తమిళేతర సీనియర్ ఐపీఎస్ అధికారులను ఎంపిక చేయనున్నారు. దర్యాప్తును నిశితంగా పర్యవేక్షించడం, ఆధారాలను సమీక్షించడం, తదుపరి విచారణకు అవసరమైన ఆదేశాలు జారీ చేయడం, సీబీఐ దర్యాప్తు సమగ్రంగా, పారదర్శకంగా పూర్తయ్యేలా చూడటం ఈ కమిటీ బాధ్యతలు

టీవీకే నాయకులకు బెయిల్

మరోవైపు ఈ ర్యాలీకి జెండాలు, ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేసినందుకు గతంలో అరెస్టు అయిన ఇద్దరు టీవీకే నాయకులైన కరూర్ వెస్ట్ జిల్లా కార్యదర్శి మతియళగన్, పట్టణ కార్యకర్త పౌన్రాజ్ కోర్టు రిమాండ్‌ను పొడిగించడానికి నిరాకరించడంతో త్రిచిలోని సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యారు. కాగా తమిళనాడు రాజకీయ ర్యాలీల చరిత్రలో అత్యంత ఘోరమైన ఈ విషాదంపై దర్యాప్తులో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడానికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది.

కరూర్ తొక్కిసలాట: రంగంలోకి దిగిన సీబీఐ - Tholi Paluku