Let's talk: editor@tmv.in
కరూర్ తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తు ప్రారంభం

కరూర్ తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తు ప్రారంభం

Shaik Mohammad Shaffee
27 అక్టోబర్, 2025

నటుడు, టీవీకే వ్యవస్థాపకుడు విజయ్ నిర్వహించిన ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట జరిగిన కరూర్ ఘటన దర్యాప్తును సీబీఐ చేపట్టింది. ఈ విషయాన్ని సీబీఐ అధికారులు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 27న జరిగిన ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

సీబీఐ దర్యాప్తు తీరు

సీబీఐ ఈ కేసు దర్యాప్తును చేపట్టడానికి ఇప్పటికే తన ప్రత్యేక బృందాన్ని కరూర్ పంపింది. దర్యాప్తు ప్రక్రియలో భాగంగా, సీబీఐ రాష్ట్ర పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను తిరిగి (రీ-రిజిస్టర్) నమోదు చేసి, స్థానిక కోర్టుకు ఈ విషయాన్ని తెలియజేసింది.సీబీఐ ప్రత్యేక బృందం కరూర్, వేలుసామిపురం వద్ద తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని సందర్శించి, క్షుణ్ణంగా పరిశీలించింది. ర్యాలీ నిర్వాహకుల వైఫల్యం, భద్రతా ఏర్పాట్లలో లోపాలు, ఈ విషాదానికి దారితీసిన కచ్చితమైన కారణాలను సీబీఐ నిష్పాక్షికంగా దర్యాప్తు చేయనుంది. ఈ దర్యాప్తుతో తొక్కిసలాటకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాలు, పర్యవేక్షణ

తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర పోలీసుల దర్యాప్తు నిష్పాక్షికంగా లేదని, దీనిపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ టీవీకే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అంతకుముందు మద్రాస్ హైకోర్టు రాష్ట్ర పోలీసు అధికారులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కానీ, రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని టీవీకే సుప్రీంను ఆశ్రయించింది.

జస్టిస్‌లు జేకే మహేశ్వరి, ఎన్.వి. అంజరియాతో కూడిన ధర్మాసనం ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. "ఈ సంఘటన దేశ మనస్సాక్షిని కదిలించింది" అని, ఇది పౌరుల ప్రాథమిక హక్కులపై తీవ్ర ప్రభావం చూపుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. నిష్పాక్షికమైన దర్యాప్తు జరిపితేనే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌పై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది.

సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించడానికి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల పర్యవేక్షక కమిటీని కూడా న్యాయస్థానం ఏర్పాటు చేసింది. దర్యాప్తును చేపట్టడానికి ఒక సీనియర్ అధికారిని నియమించాలని, ఆయన సహాయానికి అధికారులను నియమించాలని సీబీఐ డైరెక్టర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. సీబీఐ దర్యాప్తు బృందంలో ఇద్దరు తమిళనాడు క్యాడర్ ఐపీఎస్ అధికారులను చేర్చుకోవాలని కూడా ధర్మాసనం నిర్దేశించింది.

కరూర్ తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తు ప్రారంభం - Tholi Paluku