
కరీంనగర్ మేయర్ పీఠం మాదే.. కుట్ర చేస్తే యుద్దమే: కేంద్రమంత్రి బండి సంజయ్
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని భారతీయ జనతా పార్టీ దక్కకుండా చేయడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎఐఎంఐఎం పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. శనివారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచినా, ఇతర పార్టీలు కలిసి రాజకీయంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 66 వార్డులు ఉండగా, బీజేపీ 30 వార్డులు గెలుచుకుని ముందంజలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ 14, బీఆర్ఎస్ 9, ఎఐఎంఐఎం 3, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 3 స్థానాలు గెలుచుకోగా, ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నేపథ్యంలో బీజేపీకి మేయర్ పదవి దక్కకుండా మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని సంజయ్ ఆరోపించారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకే నాణెం రెండు వైపులా ఉన్నాయని తాము గతంలోనే చెప్పామని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్లో జరుగుతున్న పరిణామాల ద్వారా వారి రాజకీయ అవగాహన బయటపడుతుందని అన్నారు. ఈ అంశంపై రెండు పార్టీల నేతలు బహిరంగంగా చర్చలు జరుపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా ఈ వ్యవహారంలో సమన్వయం చేస్తున్నారని ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
బీజేపీ అభ్యర్థిని తమవైపు తిప్పుకునేందుకు ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం జరిగిందని, అయితే ఆ ఆఫర్ను తిరస్కరించారని సంజయ్ తెలిపారు. మేయర్ ఎన్నికలో బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి రావడం స్థానిక నిర్ణయమా లేదా పార్టీ అధిష్టానాల ఆదేశమా అనే విషయాన్ని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కరీంనగర్లో విజయం సాధించిన స్వతంత్ర సభ్యులు బీజేపీకి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారని, చివరకు మేయర్ పదవిని తమ పార్టీనే దక్కించుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేతలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని కూడా విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, ఎఐఎంఐఎం పార్టీలు కలిసి ‘చీకటి ఒప్పందం’ చేసుకుని బీజేపీ కార్పొరేటర్లను ప్రలోభపెట్టాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ప్రజల తీర్పు తమవైపే ఉందని, ఎన్ని కుట్రలు జరిగినా కరీంనగర్ మేయర్ సీటు భారతీయ జనతా పార్టీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎవరు అడ్డదారులు తొక్కినా బీజేపీ కార్యకర్తల శక్తిని చూపిస్తామని బండి హెచ్చరించారు.
ఇక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విభజన అంశాన్ని ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎఐఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలతో రాజకీయ అవగాహన కుదుర్చుకుని నిర్ణయాలు తీసుకుందని ఆరోపించారు. భవిష్యత్తులో ఏర్పడే మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 13న వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించగా, బీఆర్ఎస్, బీజేపీ కూడా తమ ప్రభావాన్ని చూపించాయి. ఈ ఫలితాలతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలకు దారి తీసింది.
