Let's talk: editor@tmv.in
కరాచీలో భారీ పేలుడు.. 16 మంది మృతి!

కరాచీలో భారీ పేలుడు.. 16 మంది మృతి!

Shaik Mohammad Shaffee
20 ఫిబ్రవరి, 2026

పాకిస్థాన్‌లోని ప్రముఖ నగరమైన కరాచీలో గురువారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. ఓ నివాస భవనంలో గ్యాస్ లీకేజీ కారణంగా సంభవించిన భారీ పేలుడులో 16 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో మెజారిటీ సంఖ్యలో చిన్నారులు ఉండటం అందరినీ కలిచివేస్తోంది. రంజాన్ మాసం మొదటి రోజే ఈ ప్రమాదం జరగడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

సెహ్రీ సమయంలోనే ఘటన

ఓల్డ్ సోల్జర్ బజార్ ప్రాంతంలోని ఒక బహుళ అంతస్తుల భవనంలో తెల్లవారుజామున సుమారు 4:30 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించింది. రంజాన్ ఉపవాస దీక్షల కోసం (సెహ్రీ సమయం) కుటుంబ సభ్యులందరూ నిద్రలేచి పనుల్లో నిమగ్నమైన తరుణంలోనే ఈ ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో గ్యాస్ లీకై ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో భవనం ఒక్కసారిగా కంపించింది. పేలుడు ధాటికి శిథిలావస్థలో ఉన్న ఆ భవనంలోని కొంత భాగం పూర్తిగా కుప్పకూలిపోయింది.

మృతుల్లో తొమ్మిది మంది చిన్నారులు

ఈ ఘోర ప్రమాదంలో మరణించిన వారిలో 2 ఏళ్ల నుంచి 17 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులు తొమ్మిది మంది ఉన్నారని పోలీసులు ధ్రువీకరించారు. గాయపడిన వారిలోనూ ఏడుగురు చిన్నారులు ఉన్నారు. ఘటనా స్థలం నుంచి ఇప్పటివరకు 14 మృతదేహాలను వెలికితీశామని పోలీస్ సర్జన్ డాక్టర్ సమయ్యా సయ్యద్ తెలిపారు. క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చనే అనుమానంతో అగ్నిమాపక దళం, సహాయక సిబ్బంది గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

సిలిండర్ వాడకమే శాపమైందా?

కరాచీలో సహజ వాయువు (గ్యాస్) కొరత తీవ్రంగా ఉండటంతో, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు ఎక్కువగా ఎల్‌పీజీ సిలిండర్లపైనే ఆధారపడుతుంటారు. ఈ క్రమంలోనే సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అవ్వడం వల్ల ఈ ఘోర ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా, కరాచీలో నెల రోజుల వ్యవధిలో జరిగిన రెండో పెద్ద ప్రమాదం ఇది. గత నెలలో సదర్ ప్రాంతంలోని గుల్ షాపింగ్ ప్లాజాలో జరిగిన అగ్నిప్రమాదంలో 79 మంది మరణించిన ఘటన మరవకముందే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.