
కొత్త స్నేహాలను స్వాగతిస్తాం
ముంచుకొస్తున్న బీహార్ ఎన్నికలకు అన్ని పార్టీలు సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి. కొత్త, పాత మిత్రులతో కలిసి కూటములుగా జత కట్టాయి. ఎన్డీయే, మహాఘట్బందన్ అనే రెండు బలమైన కూటములు ఈ ఎన్నికల్లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఐఎం కూడా దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో గట్టి పట్టున్న చోట పోటీ చేస్తోంది. 2020లో బీహార్లో జరిగిన ఎన్నికల్లో కూడా ఐదు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని ప్రత్యర్థి పార్టీలకు షాకిచ్చింది. ప్రస్తుతం సెప్టెంబర్ 24 నుంచి 27 వరకు బీహార్లోని సీమాంచల్ ప్రాంతాల్లోని మద్దతుదారులను కలవనున్నట్లు ఏఐఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. కలిసివచ్చే వారితో ముందుకు సాగుతామని ఈ సందర్భంగా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
గత ప్రభుత్వాలు అభివృద్ధిని విస్మరించాయి
గత ప్రభుత్వాలు సీమాంచల్ అభివృద్ధిని పూర్తిగా విస్మరించాయని ఓవైసీ అన్నారు. దీంతో ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా నష్టపోయారు. అందుకోసమే ఒంటరిగా పోటీచేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, కిషన్ గంజ్లో బుధవారం నిర్వహించే సమావేశంలో మద్దతుదారుల అభిప్రాయం మేరకు కొత్త పొత్తులపై చర్చలు ఉంటాయని తెలిపారు. మాతో జతకట్టే వారు ముందుకు రావచ్చు అన్నారు. అయితే జీఎస్టీ సంస్కరణలపై తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు ఓవైసీ మద్దతిచ్చారు. దాదాపు రూ.7 వేల కోట్ల నష్టం వస్తుందని కేంద్ర ప్రభుత్వమే ఆ నష్టాన్ని భరించాలని డిమాండ్ చేశారు. దీనికి ఓవైసీ సీఎం డిమాండ్కు పూర్తిగా అంగీకరిస్తున్నాను అని వివరించారు. దీంతో ఈ సారి బీహార్లో మహాఘట్బంధన్ కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు కలిసి సాగుతుందా అనే ఊహాగానాలు బయల్దేరాయి.
బీహార్లో కూటముల బలాలు
రాష్ట్రంలో నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని మహాఘట్బంధన్ ఓడించాలని చూస్తోంది. అయితే గత ఎన్నికల ఆయా పార్టీలు సాధించిన ఫలితాలు చూసినట్లయితే అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలున్నాయి. అందులో ఎన్డీయేకు 131 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీకి 80 మంది ఎమ్మెల్యేలు, జేడీయూకు 45, హెచ్ఏఎం(ఎస్)కు 4, 2 ఇండిపెండెంట్ సభ్యుల మద్దతు ఉంది. మహాఘట్బంధన్కు 111 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అందులో అత్యధికంగా ఆర్జేడీకి 77 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్కు 19, సీపీఐ (ఎంఎల్) 11, సీపీఐ (ఎం) 2, సీపీఐ 2 ఉన్నారు. ఎంఐఎం సభ్యులు ముగ్గురు ఆర్జేడీలో చేరారు.
