
కాంగ్రెస్ అబద్ధాలను ప్రచారం చేస్తోంది: అమిత్ షా
బీజేపీపై అబద్దాలను వ్యాప్తి చేసి రానున్న బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లబ్ది పొందాలని ప్రయత్నం చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. రాహుల్ గాంధీ ఓట్ల సవరణపై చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. గురువారం బీహర్ లోని దక్షిణ ప్రాంతాలైన డెహ్రీ, షహబాద్, మగధ ప్రాంతాలకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని, బంగ్లాదేశ్ చొరబాటుదారులను కాపాడేందుకే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అలాగే గతంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది.కానీ అలా జరగలేదు కదా? ఏ ఒక్కరి రిజర్వేషన్లనైనా తొలగించామా? అని ప్రశ్నించారు.
ఇప్పుడు ఓట్లచోరీ అంశాన్ని ముందు పెట్టి బీహార్ రాజకీయాల్లో లబ్దపొందాలని చూస్తోందని విమర్శించారు. ఇక్కడ ఉన్న అక్రమ వలసదారుల ఓట్లను తొలగించడానికే ఈసీ స్పెషల్ ఇంటెన్సివ్ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. పది జిల్లాల నేతలతో సమావేశమై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రమంతా అక్రమ వలసదారులతో నిండిపోతుందని ప్రచారం చేయాలని బీజేపీ నాయకులకు సూచించారు. ఓట్ అధికార్ యాత్ర ప్రధాన లక్ష్యం కూడా బంగ్లాదేశీయులకు మార్గం సుగమం చేయడానికేనని తిప్పికొట్టారు. ఈ సందర్భంగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తో సమావేశమయ్యారు.
