Let's talk: editor@tmv.in
ఔషధ మొక్కల సాగు రైతులకు లాభం: రాష్ట్రపతి ముర్ము

ఔషధ మొక్కల సాగు రైతులకు లాభం: రాష్ట్రపతి ముర్ము

Pinjari Chand
26 ఫిబ్రవరి, 2026

ఔషధ మొక్కల సాగు రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా నేల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మహారాష్ట్రలోని షేగావ్‌లో జాతీయ ఆరోగ్య మేళా 2026ను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. ఔషధ మొక్కలు అమూల్య సంపదగా పేర్కొంటూ, ఔషధ తయారీకి ముడిసరుకు అందించడమే కాకుండా పర్యావరణ సమతుల్యతకు కూడా కీలకమని అన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, ఆల్ ఇండియా ఆయుర్వేదిక్ కాంగ్రెస్ సంయుక్తంగా ఫిబ్రవరి 25 నుంచి 28 వరకు ఈ జాతీయ ఆరోగ్య మేళాను నిర్వహిస్తున్నాయి.

ఆరోగ్యం పరమసుఖం అని పేర్కొంటూ, ఆరోగ్యవంతులైన పౌరులు దేశ బలానికి మూలస్తంభమని రాష్ట్రపతి అన్నారు. వ్యాధి నిరోధం వ్యక్తికి మేలు చేయడమే కాకుండా దేశ ఆరోగ్య వ్యవస్థపై భారం తగ్గిస్తుందని చెప్పారు. తాను ప్రకృతి ఒడిలో పెరిగానని, ఆయుర్వేద జీవన విధానాన్ని ప్రోత్సహిస్తున్నానని తెలిపారు. అడవులు తగ్గిపోవడం వల్ల ఔషధ మొక్కలు అరుదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ ఔషధ మొక్కల పెంపుదలకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మన వ్యవసాయ క్షేత్రాలు, వంటగదులు, అడవుల్లో ఔషధ మొక్కల అపార సంపద ఉంది. వాటి సంరక్షణ, అభివృద్ధి ఔషధ తయారీకి మాత్రమే కాదు, పర్యావరణ సమతుల్యతకు కూడా అవసరం. ఔషధ మొక్కల సాగు రైతుల ఆదాయాన్ని పెంచడమే కాకుండా నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ఆమె పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ ఆరోగ్యానికి మనసు, శరీరం రెండూ ఆరోగ్యంగా ఉండాలనే భావన పెరుగుతోందని, ఆయుర్వేదం, యోగా, ఇతర ఆయుష్ విధానాలు సమతుల్య జీవనానికి మార్గం చూపుతున్నాయని అన్నారు. ఆయుర్వేదం ఆహారం, దినచర్య, ఋతుచర్య, వ్యాధి నిరోధానికి శాస్త్రీయ నియమాలు అందిస్తుందని, యోగా ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం ద్వారా శరీర-మనసు ఆరోగ్యాన్ని కాపాడుతుందని తెలిపారు. ప్రకృతిలో లభించే మూలకాలతో నేచురోపతి చికిత్సలు అందిస్తుందని, సిద్ధ వైద్యం సమగ్ర ఆరోగ్య విధానమని చెప్పారు.

యునాని, హోమియోపతి భారతదేశంలో ఉద్భవించకపోయినా, ఇవి ఇప్పుడు ఆయుష్ వ్యవస్థలో భాగమై ప్రజల ఆరోగ్యానికి సేవలందిస్తున్నాయని పేర్కొన్నారు. గత దశాబ్దంలో ఆయుష్ వైద్య విధానాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని తెలిపారు. ఆధునిక శాస్త్రీయ జోక్యాలు, ఆవిష్కరణలు, గ్లోబల్ సహకారంతో ఆయుష్‌ను మరింత సులభతరం చేసి సమకాలీన ఆరోగ్య వ్యవస్థలో సమన్వయం చేయగలమని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు షేగావ్‌లోని శ్రీ గజానన్ మహారాజ్ ఆలయంలో రాష్ట్రపతి ప్రార్థనలు చేశారు. గజానన్ మహారాజ్ జీవితం ప్రజాహితానికి అంకితం అయ్యిందని, ఆయన బోధించిన ‘గణ గణ గణాత్ బోటే’ మంత్రం సమస్త జీవులను సమానంగా చూడాలని ఉపదేశిస్తుందని ఆమె పేర్కొన్నారు.