
ఓడిశాలో ‘ఆపరేషన్ లోటస్’ నడుస్తోంది: డీకే.శివకుమార్
ఓడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లంచం ఇచ్చి ప్రభావితం చేయడానికి ప్రయత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ ఘటనను డీకే. శివకుమార్ తీవ్రంగా ఖండిస్తూ ఇది బీజేపీ నిర్వహిస్తున్న ‘ఆపరేషన్ లోటస్’లో భాగమని ఆరోపించారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన శివకుమార్ మాట్లాడుతూ, ఓడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.5 కోట్లు ఇచ్చే ఆఫర్ ఇచ్చారని తెలిపారు. ఓడిశా రాజ్యసభ ఎన్నికలు మార్చి 16న జరగనున్న నేపథ్యంలో హార్స్ ట్రేడింగ్ జరుగుతుందనే అనుమానంతో అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరుకు తీసుకువచ్చి ఒక రిసార్ట్లో ఉంచారు. ప్రస్తుతం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన కొంతమంది నాయకులు అక్కడే ఉన్నారు. శివకుమార్ మాట్లాడుతూ నలుగురు వ్యక్తులు రిసార్ట్కు వచ్చారని, అందులో ఒకరు స్థానిక వ్యక్తి సురేష్ సహాయంతో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఆన్లైన్ ద్వారా సంప్రదించినట్లు తెలిపారు. ఉదయం ఎమ్మెల్యేను కలిసినప్పుడు ఒక్కో ఓటుకు రూ.5 కోట్లు ఇస్తామని చెప్పారని తెలిపారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ హార్స్ ట్రేడింగ్కు తాను ఒప్పుకోనని చెప్పినట్లు శివకుమార్ వెల్లడించారు. వారు ఇచ్చిన చెక్కులు, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకోవాలి. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాం. తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శివకుమార్ తెలిపారు. అరెస్టయిన వారు ఈ ఉద్దేశంతోనే వచ్చామని అంగీకరించినట్లు ఆయన చెప్పారు. మిగతా వ్యక్తులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.
‘ఆపరేషన్ లోటస్’ అనే పదాన్ని కాంగ్రెస్ తరచుగా ఉపయోగిస్తుంది. బీజేపీ పార్టీ గుర్తు కమలం కావడంతో, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నాలను కాంగ్రెస్ ఈ పేరుతో విమర్శిస్తుంది. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం ఈ లంచం ప్రయత్నంలో పాల్గొన్న వారిలో ఒకరు గతంలో లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి అని తెలుస్తోంది. వారు ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఖాళీ చెక్కును చూపిస్తూ ఒప్పించే ప్రయత్నం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ఇద్దరిని పట్టుకుని బిదాడి పోలీసులకు అప్పగించినట్లు సమాచారం.
ఓడిశాలో రాజ్యసభ ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అదనంగా ఒక అభ్యర్థిని నిలబెట్టడంతో హార్స్ ట్రేడింగ్ జరిగే అవకాశముందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు కాంగ్రెస్, బీజేడీ కూడా తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి
