Let's talk: editor@tmv.in
'ఓటు చోరీ' ఆరోపణలు నిజమైతే, తెలంగాణలో అధికారాన్ని కాంగ్రెస్ వదులుకోవాలి: బండి సంజయ్

'ఓటు చోరీ' ఆరోపణలు నిజమైతే, తెలంగాణలో అధికారాన్ని కాంగ్రెస్ వదులుకోవాలి: బండి సంజయ్

Gaddamidi Naveen
16 డిసెంబర్, 2025

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న 'ఓటు చోరీ' ఆరోపణలపై కేంద్ర మంత్రి, బీజేపీ బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అదే ఎన్నికల కమిషన్, అదే ఓటరు జాబితాలు, అదే రాజ్యాంగం ఆధారంగా ఏర్పడిన తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయని గుర్తుచేస్తూ, నిజంగా ఎన్నికలు దొంగిలించబడ్డాయని కాంగ్రెస్ నమ్మితే ముందుగా ఈ రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని వదిలి ప్రజాస్వామ్యానికి ఆదర్శంగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు.

సోమవారం ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా స్పందించిన బండి సంజయ్, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు ‘సత్యం’ను ప్రస్తావిస్తూ, రాహుల్ గాంధీ తన మొత్తం వాదనను ‘అసత్యం’పైనే నిర్మించారు. దేశాన్ని తప్పుదోవ పట్టించడమే కాంగ్రెస్ రాజకీయ వ్యూహంగా మారింది అని వ్యాఖ్యానించారు.

'శక్తి'పై రాహుల్ వ్యాఖ్యలను తప్పుబట్టిన బండి సంజయ్

ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ ‘శక్తి’ని సాంస్కృతిక, నాగరికత భాషలో శక్తి, ఎనర్జీగా పేర్కొంటే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దానిని కేవలం రాజకీయ అధికారంగా చూడడం దురదృష్టకరమని సంజయ్ అన్నారు. సాంస్కృతిక భావనను రాజకీయ వివాదంగా మలచడం భారతీయ సంస్కృతిపై అవగాహన లేకపోవడానికే కాదు, ప్రాథమిక శాస్త్రీయ అవగాహన కూడా లేనట్లు చూపిస్తుందని ఆయ‌న‌ విమర్శించారు.

ప్రధాని మోదీ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన సంజయ్, ‘శక్తి’పై దాడి చేసే వారు చివరికి తామే నష్టపోతారని చెప్పారు. రాహుల్ గాంధీపై పరోక్షంగా ఎద్దేవా చేస్తూ, హిందూ ధర్మాన్ని త్వరగా ఇచ్చే సమాచార సారాంశాల నుంచి నేర్చుకోలేరు. శక్తి అనేది ‘గద్దె’ (సింహాసనం) కాదని ఆయన గ్రహించాలని అన్నారు.

గెలిచినప్పుడు సంబరం, ఓడినప్పుడు ఓటు చోరీ

కాంగ్రెస్ నిజంగా ఎన్నికలు దొంగిలించబడ్డాయని నమ్మితే, తెలంగాణ, కర్ణాటకలో అధికారాన్ని వదిలి ప్రజాస్వామ్యంపై తమ నిబద్ధతను చూపాలని సంజయ్ మరోసారి స్పష్టం చేశారు. గెలిచినప్పుడు ప్రజాస్వామ్యాన్ని జరుపుకోవడం, ఓడినప్పుడు ‘ఓటు చోరీ’ అని ఏడవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనం అని ఆయ‌న‌ అన్నారు. ఇంతకుముందు రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ ప్రజల్లో భయాలు సృష్టించిన కాంగ్రెస్, ఇప్పుడు ఓటరు ధృవీకరణ వల్ల ఆధార్, రేషన్ కార్డులు, భూములు, ఆస్తులు కోల్పోతారంటూ మరో అబద్ధపు ప్రచారం చేస్తోందని సంజయ్ ఆరోపించారు. ఇది పూర్తిగా ఉద్దేశపూర్వక భయ రాజకీయం అని ఆయ‌న‌ మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ అసత్యాన్ని తన రాజకీయ ఆయుధంగా మార్చుకుందని, ప్రస్తుత ప్రచారం సత్యం కోసం పోరాటం కాదని, ప్రజల తిరస్కరణకు ముసుగుగా మాత్రమే ఉందని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో ఓటమిని ‘ఓటు చోరీ’గా అభివర్ణించడం కోట్లాది మంది ఓటర్ల స్వేచ్ఛాయుత నిర్ణయాన్ని అవమానించడమేనని సంజయ్ అన్నారు. ఎమర్జెన్సీ కాలం నుంచి దశాబ్దాల పాటు సంస్థాగత వ్యవస్థలను కాంగ్రెస్ స్వంత ఆస్తిలా వాడుకుందని ఆయన ఆరోపించారు. ఎన్నికల కమిషనర్లపై చర్యలు తీసుకుంటామని బెదిరించడం ప్రజాస్వామ్య ధైర్యం కాదని, అది స్వచ్ఛమైన బెదిరింపేనని స్పష్టం చేశారు. తమకు అనుకూల ఫలితాలు వచ్చినప్పుడే స్వతంత్ర సంస్థలు కాంగ్రెస్‌కు ఆమోదయోగ్యంగా ఉంటాయని, అది కూడా ఒక్క కుటుంబానికి అనుకూలంగా ఉంటేనే అని వ్యాఖ్యానించారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలు

ఇదిలా ఉండగా, బీజేపీ డీఎన్‌ఏలోనే ‘ఓటు చోరీ’ ఉందని రాహుల్ గాంధీ ఆదివారం ఆరోపించారు. తమ పార్టీ ‘సత్యం’తో ఉందని, ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని’ అధికారం నుంచి తొలగిస్తామని ఆయన ప్రకటించారు. అండమాన్–నికోబార్ దీవుల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ, ప్రపంచం కేవలం సత్యాన్ని మాత్రమే కాదు, శక్తినీ గుర్తిస్తుందని భాగవత్ చెప్పారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

విశ్వం కేవలం సత్యాన్ని మాత్రమే కాదు, శక్తిని కూడా చూస్తుంది.ఎవరి దగ్గర శక్తి ఉంటుందో, వాళ్లను ప్రపంచం అంగీకరిస్తుంది. మనస్ఫూర్తిగా కాకపోయినా,తప్పక నమ్ముతుంది అని భాగవత్ శనివారం అన్నారు.

'ఓటు చోరీ' ఆరోపణలు నిజమైతే, తెలంగాణలో అధికారాన్ని కాంగ్రెస్ వదులుకోవాలి: బండి సంజయ్ - Tholi Paluku