Let's talk: editor@tmv.in
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు పోలీసుల మృతి

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు పోలీసుల మృతి

Pinjari Chand
23 ఫిబ్రవరి, 2026

ఒడిశాలోని జర్సుగూడ జిల్లాలో జాతీయ రహదారి–49పై ఆదివారం తెల్లవారుజామున ఎస్‌యూవీ వాహనం, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు పోలీసు సిబ్బంది మరణించగా, నలుగురు గాయపడ్డారు. జార్సుగూడ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒడిశా ఆదర్శ విద్యాలయ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పెళ్లి వేడుకకు హాజరై తిరిగి వస్తున్న ఎనిమిది మంది పోలీసు సిబ్బంది ప్రయాణిస్తున్న ఎస్‌యూవీకి ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టిందని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.

జర్సుగూడ అదనపు పోలీసు సూపరింటెండెంట్ మధుసిక్తా మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాకు చెందిన ఐదుగురు పోలీసు సిబ్బంది మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడి బర్గఢ్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో గాయపడిన పోలీసు స్థితి నిలకడగా ఉందని ఆమె తెలిపారు. లారీ డ్రైవర్ కూడా గాయపడి చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం తర్వాత లారీ పక్కకు ఒరిగిపోగా, పోలీసుల వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మృతులుగా గుర్తించిన వారు: కాశీరాం భోయ్, దేవదత్త శా, లింగరాజ్ ధరువా (ఆర్మ్డ్ పోలీస్ రిజర్వ్), డ్రిల్ సబ్-ఇన్‌స్పెక్టర్ నిరంజన్ కుజూర్, హోమ్ గార్డ్ భక్తబంధు మిర్ధా. గాయపడిన వారిలో ఏపీఆర్ సిబ్బంది దుబరాజ్ మిరిగా, ఆకాశ్ నాయక్, సర్జెంట్ రాజీబ్ భర్సాగర్ ఉన్నారు. ఈ ప్రమాదంపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మజి , కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ పరిహారం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి అందజేయనున్నట్లు తెలిపారు.స్థానిక ఎమ్మెల్యే టంకధర్ త్రిపాఠి జర్సుగూడ ఆసుపత్రిని సందర్శించి మృతదేహాలను పరిశీలించారు.