Let's talk: editor@tmv.in
ఐపీఎస్ పురన్‌కుమార్ ఆత్మహత్యపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదు:హైకోర్టు

ఐపీఎస్ పురన్‌కుమార్ ఆత్మహత్యపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదు:హైకోర్టు

Pinjari Chand
13 నవంబర్, 2025

ఐపీఎస్ అధికారి వై.పురన్‌కుమార్ ఆత్మహత్య ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని (పీఐఎల్) పంజాబ్–హర్యానా హైకోర్టు బుధవారం కొట్టివేసింది.న్యాయస్థానం ఈ పిటిషన్‌ను న్యాయ సంబంధ కారణం లేకుండా, పీఐఎల్ నియమాలకు–2010 విరుద్ధంగా దాఖలు చేశారని వ్యాఖ్యానించింది.

హైకోర్టు ముందు వాదనలు

విచారణ సందర్భంగా చండీగఢ్‌ యుటి తరఫున సీనియర్‌ అడ్వకేట్‌ అమిత్‌ ఝాంజీ మాట్లాడారు.అక్టోబర్‌ 9న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని పేర్కొన్నారు. అక్టోబర్‌ 10న ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ) ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేస్తోందని తెలిపారు. ఇప్పటివరకు 22 మంది సాక్షుల వాంగ్మూలాలు వీడియో రూపంలో రికార్డు చేశామని, సీసీటీవీ ఫుటేజీ, ఫోరెన్సిక్‌ ఆధారాలు పోలీసుల కస్టడీలో ఉన్నాయని వివరించారు.

పిటిషనర్‌ తరఫున విన్నూతి న్యాయవాది వినీత్‌ వాదిస్తూ నెలరోజులు గడిచినా విచారణ పురోగతి స్పష్టంగా లేదని, ఎఫ్‌ఐఆర్‌లో పేర్లు ఉన్న 13–14 మంది అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. కానీ న్యాయస్థానం ఈ వాదనలను తోసిపుచ్చి, ఎస్ఐటీ ఇప్పటికే చట్టప్రకారం విచారణ చేస్తున్నందున సీబీఐ దర్యాప్తుకు అవసరం లేదని స్పష్టం చేసింది. పిటిషనర్‌ మరో హర్యానా ఏఎస్‌ఐ ఆత్మహత్య కేసును కలిపి విచారణ చేయాలన్న డిమాండ్‌ను హైకోర్టు తిరస్కరించింది.

కేసు వివరాలు

ఈ ఏడాది అక్టోబర్‌ 7న చండీగఢ్‌లోని తన నివాసంలో ఐపీఎస్ అధికారి వై.పురన్‌కుమార్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటన స్థలంలో సర్వీస్‌ రివాల్వర్, ఎనిమిది పేజీల ‘చివరి నోట్‌’ విల్‌ పత్రం లభించాయి. మృతుడి భార్య, సీనియర్‌ ఐఏఎస్ అధికారి అమ్నీత్‌ పి.కుమార్, హర్యానా డీజీపీ శత్రుజీత్‌ సింగ్‌ కపూర్, ఎస్‌పీ రోహ్‌టక్‌ నరేంద్ర బిజార్నియాలపై జాత్యహంకార వివక్ష, మానసిక వేధింపుల ఆరోపణలు చేశారు.

వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆమె లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.