
ఏపీ హక్కుల కోసం పార్లమెంటులో పోరాడాలని వైసీపీ ఎంపీలకు జగన్ పిలుపు
నేటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రజా సమస్యలను బలంగా ప్రస్తావించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం పార్టీ ఎంపీలను ఆదేశించారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలపై గట్టిగా పోరాడాలని స్పష్టం చేశారు.
ఇటీవల 'మెంథా' తుఫాను వల్ల లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్రం కానీ ఎటువంటి పరిహారం అందించకపోవడంతో రైతులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. వరి, మొక్కజొన్న, మినుములు, పత్తి, కందులు, అరటి, మిరప, మామిడి వంటి ప్రధాన పంటలన్నింటికీ కనీస మద్దతు ధర పతనమైందని, ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం కొనుగోళ్లను ఆపేయడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నట్లు పేర్కొన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019-2024 మధ్య ప్రీమియం లేకుండా అందించిన ఉచిత పంటల బీమాను ఇప్పుడు నిరాకరిస్తున్నారని, అలాగే పెట్టుబడి రాయితీ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ-క్రాప్ నమోదు నిలిపివేయడం వలన పంట డేటాలో గందరగోళం ఏర్పడిందని, రైతులు పరిహారం పొందే అర్హతను కోల్పోయారని తెలిపారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పోరాటం
ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పాక్షికంగా ప్రైవేటీకరించడానికి ప్రైవేట్ కంపెనీలను ఆహ్వానించడం ఒక ప్రమాదకరమైన చర్య అని వైఎస్ జగన్ ఆరోపించారు. ఉక్కు కర్మాగారం కోసం భూమిని, జీవితాలను త్యాగం చేసిన వేలాది మందికి ఇది ద్రోహం అని, వెంటనే ప్రైవేటీకరణ ప్రణాళికలను రద్దు చేయాలని, ఇనుప ఖనిజ గనులను కేటాయించి, ప్లాంట్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో దాదాపు 19 లక్షల ఉపాధి హామీ జాబ్ కార్డులను తొలగించడం ద్వారా గ్రామీణ కుటుంబాలకు జీవనోపాధి లేకుండా చేశారని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలాయని ఆరోపించారు. రాజకీయ లక్ష్యంగా వేధింపులు, అక్రమ అరెస్టులు, పలువురు నాయకుల భద్రత ఉపసంహరణ వంటి చర్యలు రాష్ట్రమంతా భయం, అభద్రతను సృష్టించాయని పేర్కొన్నారు. ప్రభుత్వ హాస్టళ్లు, సంక్షేమ సంస్థలలోని విద్యార్థులు సరైన ఆహారం, తాగునీరు, పరిశుభ్రత సౌకర్యాలు లేక బాధపడుతున్నారని తెలిపారు. పెండింగ్లో ఉన్న కేంద్ర నిధులు, ఉపాధి కల్పన, ఆంధ్రప్రదేశ్ హక్కుల పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ ఎంపీలు పోరాడాలని, రాష్ట్ర ప్రజల గళం పార్లమెంట్లో వినిపించాలని జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
మరోవైపు పార్లమెంట్ శీతాకాల సమావేశాల ముంగిట అఖిలపక్ష సమావేశానికి హాజరైన వైఎస్సార్సీపీ లోక్సభ పక్షనేత మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సభలో చర్చ పెట్టి ఆంధ్రా ప్రజలకి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం పడకేసిన తీరు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కూడా తక్షణమే సభలో చర్చ జరగాలని కోరారు.
