
ఏపీలో రిలయన్స్ భారీ పెట్టుబడులు
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో 1 గిగావాట్లు సామర్థ్యం గల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రకటించారు. ప్రపంచంలోని అత్యంత అధునాతన గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (జిపియూ ఏఐ ప్రాసెసర్లకు ఆతిథ్యం ఇచ్చే విధంగా ఈ అత్యాధునిక మాడ్యులర్ సదుపాయం రూపుదిద్దుకుంటుంది.
సీఎం తమ ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా ఈ వివరాలను ప్రకటిస్తూ, ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసే ఈ ఏఐ డేటా సెంటర్ గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న రిలయన్స్ డేటా సెంటర్తో కలిసి పనిచేస్తుంది అని తెలిపారు. ఈ రెండు కేంద్రాలు సమన్వయంతో పనిచేయడం ద్వారా ఆసియాలోనే అత్యంత శక్తివంతమైన కృత్రిమ మేధస్సు (ఏఐ) మౌలిక సదుపాయాల నెట్వర్క్లలో ఒకటిగా మారుతుందని తెలిపారు.
సౌర విద్యుత్ ప్రాజెక్టు
లయన్స్ సంస్థ ప్రతిపాదిత ఏఐ డేటా సెంటర్కు నిరంతరాయంగా మరియు స్థిరమైన విద్యుత్తును సరఫరా చేసేందుకు, ఆంధ్రప్రదేశ్లో 6 గిగావాట్ పీక్ సామర్థ్యం గల భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టును అభివృద్ధి చేయనుంది. ఈ ప్రాజెక్ట్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న గ్రౌండ్-మౌంటెడ్ సౌర సామర్థ్యాన్ని రెట్టింపు చేయడమే కాకుండా రాష్ట్రం మొత్తం పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో 30 శాతానికి పైగా వాటాను అందిస్తుంది. తద్వారా ఆంధ్రప్రదేశ్ అపారమైన సౌర శక్తి సామర్థ్యాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుంది.
రాయలసీమలో ఫుడ్ పార్క్
వీటితో పాటు, రిలయన్స్ సంస్థ రాయలసీమలో గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కును నిర్మించనుంది. ఈ ప్రపంచ స్థాయి ఆటోమేటెడ్ సదుపాయం ద్వారా వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభించడంతో పాటు, వేలాది కుటుంబాలకు స్థిరమైన ఆదాయం లభిస్తుంది.
ఈ సందర్బంగా సీఎం చైర్మన్ శ్రీ ముఖేష్ అంబానీకి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ ఒప్పందం ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణ, వృద్ధి ప్రయాణంలో మైలురాళ్లను సూచిస్తాయని పేర్కొన్నారు. సీఎం, ఐటీ మంత్రి నారా లోకేష్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.
రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్ మాట్లాడుతూ, రిలయన్స్ ఆంధ్రప్రదేశ్కు కేవలం డబ్బు (పెట్టుబడి) పెట్టడానికి రాలేదని, ఇక్కడ ప్రజలకు మేలు (సాధికారత) చేయడానికి, సేవలు అందించడానికి వచ్చామని తెలిపారు. తమ లక్ష్యం కృత్రిమ మేధస్సు (ఏఐ) ను టెక్నాలజీని మైజియో అనే తమ యాప్ ద్వారా సాధారణ విద్యార్థులు, రైతులు, చిన్న వ్యాపారులు వంటి అందరికీ చాలా సులభంగా, తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకు రావడం అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే రిలయన్స్, ఆయిల్, గ్యాస్, డిజిటల్ సేవలు, రిటైల్ వంటి విభాగాల్లో రాష్ట్రంలో 25 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా)పెట్టుబడి పెట్టిందని ఆయన పేర్కొన్నారు.
